‘మర్డర్’ సినిమా విడుదలకు బ్రేక్..
Court orders for RGV’s Murder Movie: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా విడుదల ఆపాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చిన వాదనలను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల ఆర్జీవీ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తన కొడుకు హత్యకేసు కోర్టులో పెండింగులో ఉండగా సినిమా తీస్తే సాక్షులు, బాధితులపై ప్రభావం చూపుతుందని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ‘మర్డర్’ సినిమా పోస్టర్లలో వర్మ ఉపయోగించి ప్రణయ్, అమృత, మారుతీరావుల ఫోటోలు, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాలస్వామి సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.