Sikkim flash flood : సిక్కిం మెరుపు వరదల్లో 19కి పెరిగిన మృతుల సంఖ్య, 98 మంది గల్లంతు
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 19కి పెరిగింది. వరదపీడిత ప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గల్లంతైన 16 మంది సైనికుల కోసం ఆర్మీ బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా వెతుకుతోంది....
Sikkim flash flood : సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 19కి పెరిగింది. వరదపీడిత ప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గల్లంతైన 16 మంది సైనికుల కోసం ఆర్మీ బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా వెతుకుతోంది. ఆకస్మిక వరదల్లో సైనిక శిబిరం నుంచి పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి కొట్టుకుపోయాయి. లాచెన్ సమీపంలోని షాకో చో సరస్సు వరదల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
Also Read : Mumbai : ముంబయి భవనంలో అగ్నిప్రమాదం..ఏడుగురి మృతి, 40మందికి గాయాలు
అధికారులు పరిసర ప్రాంతాల నుంచి నివాసితులను ఖాళీ చేయటం ప్రారంభించారు. లాచెన్, లాచుంగ్లో 3వేల మంది చిక్కుకుపోయారు. మోటార్సైకిళ్లపై అక్కడికి వెళ్లిన 3,150 మంది కూడా వరదల కారణంగా చిక్కుకుపోయారు. తాము ఆర్మీ, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లతో అందరినీ తరలిస్తామని సిక్కిం ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసింది. బుధవారం ఉదయం తీస్తా నది నీటిమట్టం పెరిగింది.
మంగన్ జిల్లాలో నలుగురు మరణించగా, 17 మంది గల్లంతయ్యారు. గాంగ్టక్లో ఐదుగురు మరణించారు. 22 మంది తప్పిపోయారు. పాక్యోంగ్ జిల్లాలో ఆరుగురు సైనికులతో సహా పది మంది మరణించారు, 59 మంది తప్పిపోయారు. వరద నీరు తగ్గిన తర్వాత సిక్కింలోని జలవిద్యుత్ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని క్షుణ్ణంగా అంచనా వేస్తామని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ఆకస్మిక వరదల్లో 19 మంది మృతి చెందగా, 100 మందికి పైగా తప్పిపోయారు.