Mumbai Attack: ముంబై దాడుల సూత్రధారిపై నిషేధానికి అడ్డుతగిలిన చైనా.. మరోసారి భారత ప్రయత్నాల్ని అడ్డుకున్న చైనా
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
Mumbai Attack: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డు తగిలింది. 26/11 ముంబై దాడుల సూత్రధారి, పాకిస్తాన్ తీవ్రవాది సాజిద్ మీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే భారత ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. అమెరికాతోపాటు, భారత్ ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన చేశాయి.
కానీ, సాజిద్ మీర్ పేరును బ్లాక్ లిస్టులో ఉంచేందుకు చైనా అంగీకరించలేదు. సాజిద్ మీర్.. లష్కర్ ఏ తైబాకు చెందిన తీవ్రవాది. ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్నాడు. తాజా ప్రతిపాదన ప్రకారం.. సాజిద్ మీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే అతడి ఆస్తులు సీజ్ అవుతాయి. అతడు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి వీల్లేదు. అలాగే ఏ ఆయుధాలు కలిగి ఉండకూడదు. ఇక, ఇప్పటికే అమెరికా అతడిపై 5 మిలియన్ డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. కాగా, పాకిస్తాన్ ఇటీవల అతడిపై కొన్ని చర్యలు తీసుకుంది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అతడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Amit shah slams kcr: అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు: అమిత్ షా
కానీ, ముంబై పేలుళ్లకు సంబంధించి మాత్రం పాక్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐరాసలో సాజిద్ మీర్కు సంబంధించిన ప్రతిపాదనపై భద్రతా మండలిలోని అన్ని దేశాలు ఆమోదం తెలిపాయి. కానీ, చైనా వ్యతిరేకించింది. పాక్ ఉగ్రవాదులపై చర్యల విషయంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎప్పట్నుంచో అడ్డుకుంటోంది. ఈ ఏడాది జూన్లో లష్కరే తయిబా చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చేసిన ప్రతిపాదనను కూడా చైనా అడ్డుకుంది. ఈ తరహా ప్రతిపాదనల్ని చైనా అడ్డుకోవడం ఇది నాలుగు నెలల్లో మూడోసారి.