కొంపముంచిన పెళ్లి విందు, ముగ్గురికి కరోనా పాజిటివ్, 500మంది క్వారంటైన్

వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 11:03 AM IST
కొంపముంచిన పెళ్లి విందు, ముగ్గురికి కరోనా పాజిటివ్, 500మంది క్వారంటైన్

వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్

వెస్ట్ బెంగాల్ లో ఓ పెళ్లి విందులో కరోనా కల్లోలం రేపింది. పెళ్లికి వచ్చిన ముగ్గురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలినవారిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో మార్చి 15న ఈ పెళ్లి జరిగింది. ఇద్దరు వృద్ధులు సహా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. పెళ్లి విందుకు 500 మందికి పైగా హాజరయ్యారు. వారందరినీ క్వారంటైన్ చేశారు. ఈ ఘటనను జిల్లా వైద్యాధికారులు ఆందోళన కలిగించేదిగా అభివర్ణించారు. పెళ్లి కొడుకు తండ్రి స్నేహితులు లండన్, సింగపూర్ నుంచి వచ్చారట. వివాహ విందుకు హాజరైన గెస్టుల్లో తెలంగాణతోపాటు, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి వచ్చినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.

పెళ్లి కొడుకు తల్లి, మేనత్తకు పాజిటివ్:
ముందుగా అస్వస్థతకు గురైన 66ఏళ్ల వృద్ధుడు కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడిని కలిసిన మరో 13 మందిని విడిగా ఉంచి పరీక్షిస్తున్నారు. పెళ్లి కొడుకు తల్లి (56), ఆమె మేనత్త (76)లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అసలు ఆ వృద్ధునికి కరోనా ఎలా వచ్చిందీ ఇంకా నిర్ధారణ కాలేదు. మొత్తం 500 మంది అతిథులను పరీక్షించారు. ఇప్పటివరకు ఎవరిలోనూ కరోనా బయటపడలేదు. కానీ ఇంటి దగ్గర క్వారంటైన్‌లో ఉండమని వారందరికీ చెప్పి పంపారు.

పెళ్లి విందుకు హాజరైన అతిథుల్లో ఎన్ఆర్ఐలు:
శనివారం(మార్చి 28,2020) వెస్ట్ బెంగాల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు కరోనా బారిన పడ్డారు. దీంతో వెస్ట్ బెంగాల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. ముగ్గురు మహిళల్లో ఒకరి వయసు 76 ఏళ్లు, మరొకరి వయసు 56ఏళ్లు. ఆ ఇద్దరు ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా వాసులు. మరొకరి వయసు 54 ఏళ్లు. ఆమెది డార్జిలింగ్ జిల్లా. ముగ్గురిలో ఎగ్రా ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఏ విదేశాలకు వెళ్ల లేదు. కాగా, ఆ ఇద్దరు కరోనా బారిన పడిన వృద్ధుడికి బంధువులు అవుతారు. నయాబాద్ కు చెందిన వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి బంధువులే ఈ మహిళలు. వీరంతా ఎగ్రాలో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యారు. ఈ పెళ్లి విందుకు కొందరు విదేశీయులు హాజరైనట్టు అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఈ ముగ్గురికి కరోనా వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.

వేడుకులకు దూరంగా ఉండాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు:
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుంటున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, వేడులకు వెళ్లకూడదని పదే పదే చెబుతున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలను పాటించడం లేదు. చివరికి ఇలా ప్రమాదం బారిన పడుతున్నారు. కరోనా సోకి పేషెంట్లు అవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ లోని మిడ్నాపూర్ లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పట్టించుకోకుండా పెళ్లి వేడుకకు 500మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వారిలో కరోనా బాధితులు కూడా ఉన్నారు. వారి కారణంగా మరికొందరికి కరోనా సోకింది.

భారత్ లో 979 కరోనా పాజిటివ్ కేసులు, 25 మరణాలు:
మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 979కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 25మంది కరోనాతో చనిపోయారు. 867 మంది భాతులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి 86మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో 193 కరోనా కేసులు, ఏడు మరణాలు:
మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. గుజరాత్ లో నలుగురు, కర్నాటకలో ముగ్గురు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, బెంగాల్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. శనివారం(మార్చి 28,2020) మహారాష్ట్రలో కరోనాతో మరొకరు చనిపోయారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 40 ఏళ్ల మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. మహారాష్ట్రలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 193కి పెరిగింది.

ఏపీలో 19 కరోనా కేసులు:
ఇక ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున బాధితులున్నారు. ప్రకాశం జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు ఉన్నారు. ఇవాళ(మార్చి 29,2020) రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పరీక్షించిన 16 నమూనాలు నెగిటివ్ గా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. 16మంది అనుమానితులకు కరోనా లక్షణాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటివరకు 512మంది     అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. వీటిలో 19 మందికి పాజిటివ్ రాగా, 433మందికి నెగిటివ్ వచ్చింది. 60మంది నమూనాల ఫలితాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 29వేల 367 మందిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 29వేల 172మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు వివరించారు. 195మందిని ఆసుపత్రిలో చేర్చి పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణలో 67 కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 67కి చేరింది. నిన్న(మార్చి 28,2020) ఒక్క రోజే 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనాతో వృద్ధుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో వృద్ధుడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 30,880మంది కరోనాతో మృతి:
199 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 63వేల 748మంది కరోనా బాధితులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30వేల 880 మంది కరోనాతో చనిపోయారు. లక్ష 42వేల 184మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇటలీలో 10వేల 23మంది, స్పెయిన్ లో 5వేల 982మంది, చైనాలో 3వేల 300మంది, ఇరాన్ లో 2వేల 517మంది, ఫ్రాన్స్ లో 2వేల 314మంది, అమెరికాలో 2వేల 227మంది, యూకేలో 1,019మంది, నెదర్లాండ్స్ లో 639మంది, జర్మనీలో 433మంది, బెల్జియంలో 353మంది, స్విట్జర్లాండ్ లో 264మంది, దక్షిణ కొరియాలో 152మంది, బ్రెజిల్ లో 114మంది, టర్కీలో 108మంది, స్వీడన్ లో 105మంది, ఇండోనేషియాలో 102మంది, పోర్చుగల్ లో 100మంది, ఆస్ట్రియాలో 68మంది, ఫిలిప్పిన్స్ లో 68మంది, డెన్మార్క్ లో 65మంది, కెనాడాలో 60మంది, జపాన్ లో 52మంది చనిపోయారు.