ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం..భద్రతా దళాల మోహరింపు..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం..భద్రతా దళాల మోహరింపు..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Farmers’ protest in Delhi borders : ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుంది. 67 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు.. సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు. సింఘు, టిక్రి, ఘజిపూర్ వద్ద రోడ్లపై పెద్ద ఎత్తున రైతులు చేరారు. సాగు చట్టాల రద్దు, పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల చేరికతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా దళాల మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు.

రాత్రికి రాత్రే ఘాజీపూర్‌ సరిహద్దుల్లో వందలాది శిబిరాలు వెలిశాయి. రైతులు మద్దతుగా జాట్‌లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే జాట్‌ యువత ఢిల్లీకి చేరుకోవాలని చెప్పడంతో.. వేలాది మంది తికాయత్‌కు మద్దతుగా ఘాజీపూర్‌లో దిగారు. ఇప్పటివరకు కేవలం రైతుల ఆందోళనగా సాగుతున్న ఉద్యమం… ఇపుడు జాట్‌ రైతుల ఆందోళనగా మారింది. దాంతో రైతుల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.. ఉద్యమం ఇంకా ఉధృతమవుతూనే ఉంటుంది కానీ తగ్గదంటూ.. రైతులు అంటున్నారు.

రైతుల దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే.. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింసాకాండ తర్వాత ఇంటి ముఖం పట్టిన వేలాది మంది రైతులు మళ్లీ ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన హోంశాఖ ఇంటిలిజెన్స్‌ అధికారుల సమాచారం మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు‌, ఘాజీపూర్‌, టిక్రి ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇంటర్‌నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దేశ రాజధాని సమీపంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్‌నెట్‌ను నిలిపిస్తున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.