అతను తొలి హిందూ తీవ్రవాది : కమల్ సంచలన వ్యాఖ్యలు
స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అరవక్కురిచ్చిలో మాట్లాడిన కమల్ హాసన్.. మహాత్మగాంధీని హత్య చేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ప్రారంభమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరక్కురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను ఈ వాఖ్యలు చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్.
1948లో జరిగిన గాంధీ హత్యకు సంబంధించి సమాధానాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చానని, నిజమైన భారతీయులు మూడు రంగుల జెండాను గౌరవిస్తూ మతాల సమానత్వంకు విలువ ఇస్తారని వివరించారు. గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాంధీని చంపిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇదే మాట చెబుతా’ అని కమల్హాసన్ అన్నారు. గాడ్సేను కూడా సమర్థించేవారు ఉన్నారంటూ ఆయన విమర్శించారు. అలాంటి వారిని ఏమనాలి.. వాళ్లను ఎవరితో పోల్చాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. శాంతి దేశం అని వ్యాఖ్యానించారు.