పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ పవార్..పంజాబ్ ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరుగనున్న రైతుల ట్రాక్టర్ ర్యాలీకి సంఘీభావంగా నాసిక్ నుంచి ర్యాలీగా ముంబై ఆజాద్ మైదానానికి పెద్ద సంఖ్య తరలివచ్చిన రైతులను పవార్ ప్రశంసించారు.

రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుని పవార్ తప్పుబట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో 60 రోజుల నుంచి తీవ్ర చలిలోనూ ఉద్ధృతంగా ఆందోళన కొనసాగిస్తున్న రైతుల గురించి.. దేశ ప్రధాని కనీసం పట్టించుకోలేదని పవార్​ ధ్వజమెత్తారు. 60 రోజులుగా నిరసనలు చేస్తున్న రైతుల కోసం ప్రధాని కనీసం విచారించారా? ఆందోళన చేస్తున్నవారందరూ పంజాబ్ కి చెందిన రైతులని కేంద్రం అంటోంది..పంజాబ్ ఏమైనా పాకిస్తానా? అంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. నూతన సాగు చట్టాలను రైతులే నాశనం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెజారీటీని ఉపయోగించి రాజ్యాంగాన్ని బలహీనపరిచే ఏ చట్టాన్ని అయినా కేంద్రం ఆమోదించవచ్చు. అయితే సాధారణ పౌరులు, రైతులు వాటికి ఎదురుతిరిగితే.. వెనక్కి తీసుకునేంత వరకు నిద్రపోరని పవార్ అన్నారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్​ పై పవార్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నర్​ భగత్ సింగ్ కొశ్యారిని కలవడానికి రైతులు వెళితే.. ఆయన గోవా వెళ్లిపోవడంపై పవార్ విమర్శలు గుప్పించారు. గవర్నర్​కు కంగనా రనౌత్​తో ముచ్చటించడానికి సమయం ఉంది కానీ.. రైతులతో సమావేశం అవడానికి లేదు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవడం గవర్నర్​ నైతిక బాధ్యత. ఇలాంటి గవర్నర్​ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అన్నారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి ఆజాద్​ మైదానానికి చేరుకున్న రైతులు.. గవర్నర్​ను కలిసి వినతి పత్రం అందించడానికి రాజ్​భవన్​కు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వారిని దారిలోనే పోలీసులు అడ్డుకున్నారు.