Nipah virus : ఈ పండు తినడం వల్లే కేరళలో ఆ బాలుడికి నిపా వైరస్ వచ్చిందా?
కేరళలో నిపా వైరస్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడికి నిపా వైరస్ సోకటానికి ఓ రకం పండు కారణమైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటా పండుకు నిపా వైరస్ కు సంబంధమేంటీ?
Nipah virus in kerala : కేరళలో నిపా వైరస్ భయాందోళనలు కలిగిస్తోంది. నిఫా వైరస్ సోకి కోజికోడ్లో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మరణంతో భయాందోళనలు మరింతగా పెరిగాయి. దీంతో కేరళకు వెళ్లిన కేంద్ర నిపుణుల బృందం సోమవారం అధికారులు స్వల్ప లక్షణాలు కనిపించిన 8 మంది రక్త నమూనాలతోపాటు ఓ పండును కూడా పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీకి పంపించారు.నిఫా కలకలంతో ఇప్పటికే కేంద్ర నిపుణుల బృందం..కేరళకు వెళ్లింది. మృతి చెందిన బాలుడి ఇంటికి వెళ్లింది. వారి నుంచి వివరాలు సేకరించింది.ఆ బాలుడి ఆహారపు అలవాట్లు, ఎక్కడెక్కడకు తిరిగాడు. ఎప్పటినుంచి అస్వస్థతకు గురయ్యాడు? అస్వస్థతలో ఎటువంటి లక్షణాలను మీరు గుర్తించారు?వంటి పలు అంశాలపై కుటుంబ సభ్యులను నిపుణుల బృందం ప్రశ్నించింది.
ఈ వివరాల్లో మృతుడి కుటుంబ సభ్యులు కొన్ని ఆసక్తికర అనుమానాలను వ్యక్తంచేశారు. మా అబ్బాయి కొన్ని రోజుల క్రితం ఓ పండు తిన్నాడని ఆ పండు తినటం వల్లనే అస్వస్థతకు గురయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ పండు పేరు ‘రేంబుటాన్’. ఆ పండు తినడం వల్లే ఆ బాలుడికి వైరస్ సోకి ఉండొచ్చని ఆ బాలుడి ఇంట్లోని వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కేంద్ర నిపుణుల బృందం బాలుడి ఇంటిలో ఉన్న రేంబుటాన్ పండ్ల నమూనాలను తీసుకున్నారు. ఇప్పుడా బాలుడి ఇంటి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మొత్తం 188 మంది ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించారు. చాతమంగళం పంచాయత్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా నిర్బంధించారు.
బాలుడి ప్రైమరీ కాంటాక్ట్ల సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆ బాలుడిని తల్లిదండ్రులు మొదట స్థానిక క్లినిక్కు వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. ఆ తరువాత మరో ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి ఓ మెడికల్ కాలేజీకి..ఆ తరువాత మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ప్రైమరీ కాంటాక్ట్లుగానే అనుమానిస్తున్నారు. కాంటాక్ట్లను గుర్తించడానికి ఫీల్డ్ వర్కర్లకు ప్రత్యేకంగా సూచనలతో గుర్తించేలా చేస్తున్నారు.
మృతి చెందినబాలుడికి ఆగస్టు 27న జ్వరం రాగా.. హాస్పిటల్లో చేర్చారు. ఆ రోజు నుంచి ఆ బాలుడు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడు? ఎక్కడెక్కడకు ఆ బాలుడు తిరిగాడు? అనే విషయాలపై కేరళ ఆరోగ్య శాఖ ఓ సవివరమైన రూట్ మ్యాప్ను రూపొందించింది. అసలు వైరస్ మళ్లీ ఎక్కడి నుంచి వచ్చిందన్నది చాలా ముఖ్యం..అసలు నిఫా వైరస్ తొలుత బాలుడికే వచ్చిందా? లేదా వేరే ఎవరిద్వారానైనా ఆ బాలుడికి సోకిందా? అనే విషయం గుర్తించే పనిలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. కాగా..ఇప్పటికే భారీగా పెరుగుతున్న కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను ఇప్పుడు నిపా వైరస్ మళ్లీ వణికిస్తోంది. గత మూడేళ్ల క్రితం కేరళలోనే కోజికోడ్ లోనే నిఫా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే.