Women Dies After Eating Biryani : బాబోయ్.. బిర్యానీ తిని యువతి మృతి, వారం రోజుల్లో రెండో ఘటన, విచారణకు మంత్రి ఆదేశం
బిర్యానీ ఓ యువతి ప్రాణం తీసింది. ఏంటి షాక్ అయ్యారా? అవును నిజమే.. బిర్యానీ తిన్న యువతి మరణించింది. ఈ షాకింగ్ ఘటన..
Women Dies After Eating Biryani : బిర్యానీ అంటే చాలామందికి ఇష్టమే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే.. చాలామంది బిర్యానీ పేరు చెబుతారు. ఇక ఏదైనా అకేషన్ వచ్చినా, ఫ్రెండ్స్, బంధువులతో కలిసి హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లినా.. కచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేస్తారు. అంతగా ఇష్టం బిర్యానీ అంటే. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే గల్లీ గల్లీకో బిర్యానీ షాప్ ఉంటుంది. అయితే, అదే బిర్యానీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. బిర్యానీ ప్రియుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అదేమిటంటే.. బిర్యానీ ఓ యువతి ప్రాణం తీసింది. ఏంటి షాక్ అయ్యారా? అవును నిజమే.. బిర్యానీ తిన్న యువతి మరణించింది. ఈ షాకింగ్ ఘటన కేరళలో జరిగింది.
కేరళలో ఓ యువతి డిసెంబర్ 31న ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నాక అనారోగ్యం పాలైంది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
కాసర్గోడ్ సమీపంలోని పెరుంబలకు చెందిన అంజు శ్రీపార్వతి(20) డిసెంబర్ 31న రొమాన్సియా అనే రెస్టారెంట్ నుంచి బిర్యానీ (కుళిమంతి) కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. బిర్యానీ ఇంటికి వచ్చింది. ఆ బిర్యానీని లొట్టలేసుకుంటూ ఆమె తినేసింది. అయితే, అది తిన్నాక ఆమె అనారోగ్యం బారిన పడింది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. తొలుత ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని మరో హాస్పిటల్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలింది.
యవతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బిర్యానీ తిన్న యువతి అనారోగ్యానికి గురై మరణించిందనే వార్త తీవ్ర కలకలం రేపింది. దీనిపై దుమారం రేగింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయిన ఘటన వారం రోజుల వ్యవధిలో ఇది రెండోది. కేరళలోని కొట్టాయంలో ఇటీవల (డిసెంబర్ 29) ఓ ఈవెంట్లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలొచ్చాయి. అది మరువక ముందే.. రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. బిర్యానీ తిన్న యువతి అస్వస్థతకు గురై చనిపోవడం కలకలం రేపింది.