సినిమా సీన్ను తలపించేలా…రైతుల సమస్యలు తీర్చేందుకు రైతు వేషంలో వెళ్లిన మంత్రి
అచ్చం సినిమా సీన్ను తలపించే ఘటన ఒకటి మహారాష్ట్రలో జరిగింది. అధిక రేటుకు విక్రయించడానికి ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు వ్యాపారులపై ఫిర్యాదులు వస్తుండటంతో ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించటానికి సాక్షాత్తూ మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజీ భూసే రైతు వేషం వేశారు. ఓ సాధారణ రైతులా వెళ్లి ఓ ఎరువుల షాపు యజమాని పనిపట్టారు. ఆదివారం ఔరంగాబాద్లో ఈ సంఘటన జరిగింది.
ఆదివారం మంత్రి దాదాజి భూసే… రైతు వేషంలో ఔరంగాబాద్లోని ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవభారత్ అనే ఎరువుల షాపు దగ్గరకు వెళ్లి 10 బస్తాల యూరియా కావాలని అడిగారు. అయితే షాపు యజమాని ఎరువుల నిల్వలు ఉన్నప్పటికి లేవని సమాధానం ఇచ్చాడు. స్టాక్ రిజిస్టర్ చూపించమని అడిగితే ఇంట్లో మర్చిపోయానని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన మంత్రి జిల్లా అధికారులను షాపుపై సోదాలకు ఆదేశించారు. సోదాలు నిర్వహించిన పోలీసులు 1300 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు .క్వాలిటీ కంట్రోల్ అధికారులు సక్రమంగా పనిచేయాలని, అలా అయితేనే రైతులు ఇబ్బందులు పడరని ఈ సందర్భంగా మంత్రి భూసే అన్నారు.
Read: SBI కస్టమర్లకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి