Delhi : బీజేపీ ఆఫీసుపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకుంటే జరిగేది అదే..: కేటీఆర్
బీజేపీది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే స్వభావం అంటూ మరోసారి బీజేపీ (కేంద్ర ప్రభుత్వం)పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే తెలంగాణలో నడవలేని స్థితిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే అది బీజేపీ వైపు ఎవ్వరు కన్నెత్తికూడా చూడరని ఎద్దేవా చేశారు.
minister ktr fire on BJP govt : తెలంగాణలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని..బీజేపీది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే స్వభావం అంటూ మరోసారి బీజేపీ (కేంద్ర ప్రభుత్వం)పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీది రాజకీయ భావ దారిద్ర్యం అంటూ తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే తెలంగాణలో నడవలేని స్థితిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే అది బీజేపీ వైపు ఎవ్వరు కన్నెత్తికూడా చూడరని ఎద్దేవా చేశారు. తాము చేయాలనుకుంటే ప్రధాని మోడీ బొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించగలం అని..కానీ అటువంటి కుసంస్కారం మాకు లేదని అన్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం(జూన్27,2022) నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.అలాగే మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. సిన్హా నామినేషన్ వేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతి ఎన్నికలో యశ్వంత్ సిన్హాకు పూర్తి మద్దతు తెలుపుతున్నాం అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ఆ పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది అని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణగా మద్దతు ప్రకటించాం. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాం. హైదరాబాద్లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించే బీజేపీ నిరంకుశ పాలనను టీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని..రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చి వేస్తు బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అటువంటి బీజేపీని అందరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చి వేసిందని ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నది కూడా అదేనని అన్నారు. ప్రభుత్వాలను కూల్చివేయటానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ఉసిగొలుపుతోంది అంటూ సంచలన విమర్శలు చేశారు.
దేశంలో అమలు జరిగేది అంబేద్కర్ రాసినిరాజ్యాంగం కాదని..మోడీ రాజ్యాంగమే నడుస్తోందని బీజేకిది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు. బీజేపీకి గిరిజనులమీద అభిమానం ఉంటే తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినా..బీజేపీనేతలు పట్టించుకోలేదని కేటీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ కోల్పోయిన మా ఏడు గిరిజన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఒడిశాలో 13మంది గిరిజనులను 2006లో కాల్చి చంపిన సమయంలో ద్రౌపది ముర్ము ఒడిశా మంత్రిగా ఉన్నారని..ఆ సమయంలో ఆమె కనీసం స్పందించను కూడా స్పందించలేదని విమర్శించారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని ద్రౌపది ముర్మను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. ఒడిశాలో 13 మంది గిరిజనులను కాల్చి చంపినప్పుడు ముర్ము ఎందుకు నోరు మెదపలేదు? అంటూ ప్రశ్నించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు. గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్లో స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చిచంపారు. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ద్రౌపది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ విమర్శించారు.