మోడీజీ.. యుద్ధం ముగిసింది, మీ కర్మఫలం ఎదురుచూస్తోంది: రాహుల్ ఘాటు ట్వీట్

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 12:19 PM IST
మోడీజీ.. యుద్ధం ముగిసింది, మీ కర్మఫలం ఎదురుచూస్తోంది: రాహుల్ ఘాటు ట్వీట్

దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారు  అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు.  ఘాటుగా ట్వీట్ చేశారు. “మోడీ జీ.. యుద్ధం ముగిసింది. మీ కర్మఫలం ఎదురుచూస్తోంది. మీలో ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. నా తండ్రిపై చేసే విమర్శలు మిమ్మల్ని ఎన్నటికీ కాపాడలేవు,  ప్రేమతో ఓ కౌగిలింత” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ర్యాలీలో ప్రధాని మోడీ.. రాజీవ్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. రాజీవ్‌ గాంధీ తన జీవితాన్ని నెంబర్ వన్‌ అవినీతిపరుడిగా ముగించుకున్నారు అని  విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కాంగ్రెస్ శ్రేణులకు కోపం తెప్పించింది. ప్రధానిపై వారు మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. రాజీవ్‌ గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ కూడా మోడీ విమర్శలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. రాజీవ్‌ త్యాగాన్ని కూడా ప్రధాని అవమానిస్తున్నారని వాపోయారు. మోడీకి అమేథీ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రియాంకా గాంధీ అన్నారు. అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు అడిగే మోడీ.. ఒక గొప్ప వ్యక్తి బలిదానాన్ని అగౌరవపర్చడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు.

రాజీవ్ గాంధీపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం గుర్తు చేశారు. ఈ విషయాన్ని మోడీ తెలుసుకోవాలని సూచించారు. ప్రజా సేవలో ఉంటూ మరణించిన వ్యక్తిని విమర్శించి.. మోడీ అన్ని హద్దులు చెరిపేశారని చిదంబరం మండిపడ్డారు.