నా చావుకు సీఎంనే కారణం : మాజీ IPS సూసైడ్ నోట్
మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సీఎం మమతా బెనర్జీయే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. ఈ నోట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. 1986 బ్యాచ్కు చెందిన గౌరవ్ దత్.. ఫిబ్రవరి 19న ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో సీఎం మమతా బెనర్జీ పేరును ప్రస్తావించాడు. 2018 డిసెంబర్ 31వ తేదీన నేను రిటైర్ అయ్యాను. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని..అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు.
రిటైర్మెంట్ అనంతరం తన పెన్షన్.. పీఎఫ్ గ్రాట్యుటీ లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తం రూ.72 లక్షలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో పలుమార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకున్నా.. డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నోట్ లో. దీనికి సంబంధించి ఎన్నో సార్లు సీఎం మమతాను కలిసేందుకు.. సెక్రటరీ గౌతమ్ సనాల్ ను అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని వాపోయారు. ఈ క్రమంలో సీఎం మమతా తనకు సంబంధించిన ఫైల్ ను ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టారని తెలిపారు.
మాజీ IPS అధికారి ఆత్మహత్యకు కారణమైన సీఎం మమతాను అరెస్టు చేయాలని.. సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ నేత ముఖుల్ రాయ్ డిమాండ్ చేస్తున్నారు. ఓ ఐపీఎస్ అధికారి ఇలా ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో మొదటిసారి అన్నారు. ఇది దారుణమంటూ ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని ఆత్మహత్య చేసుకున్న అధికారి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.