వ్యాక్సిన్ కొరత తీరాలంటే అదొక్కటే మార్గం..కేంద్రానికి కేజ్రీవాల్ సూచన
దేశంలో వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు.
Arvind Kejriwal దేశంలో వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నేషనల్ ప్లాన్ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీలు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని… ఇదే తరహాలో అయితే, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లు పడుతుందని అన్నారు.
రెండు కంపెనీలతో దేశమంతా వ్యాక్సిన్ ఇవ్వడం అసంభవమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. వ్యాక్సిన్ తయారుచేసే ఇతర కంపెనీలకు ఫార్ములాను అందజేయాలని కోరారు.వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఒరిజినల్ వ్యాక్సిన్ తయారీదారులకు రాయల్టీగా చెల్లించాలన్నారు. దేశ జనాభా అందరికీ వ్యాక్సినేషన్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని కేజ్రీవాల్ తెలిపారు. అప్పుడే కరోనా వైరస్ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. లేదంటే రోజు రోజుకు రూపం మార్చుకుంటున్న కరోనా వల్ల ఇంకా చాలా సమస్యలు ఏర్పడుతాయని హెచ్చరించారు.
మరోవైపు,ఢిల్లీలో లాక్డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని కేజ్రీవాల్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని తెలిపారు. లాక్డౌన్ కాలాన్ని తాము వైద్య మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు వాడామని తెలిపారు. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత తగ్గిందని చెప్పారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డోసులు తక్కువగా అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మేము ఆశిస్తున్నామని చెప్పారు. మరోవైపు.. ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు సీరియస్గానే స్పందించిన విషయం తెలిసిందే. కేంద్రంపై న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆక్సిజన్ సరఫరా, పంపిణీకి 12 సభ్యులతో జాతీయస్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.