‘ఖేల్రత్న’ అవర్డుకు హిమదాస్.. అస్సాం ప్రభుత్వం సిఫారసు
భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ హిమదాస్ను ప్రతిష్టాత్మక ‘రాజీవ్గాంధీ ఖేల్రత్న’ అవార్డుకి సిఫారసు చేసింది అస్సాం ప్రభుత్వం. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు పంపింది.
రెండేళ్ల క్రితం అత్యద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె పేరును ఖేల్రత్న అవార్డుకు ప్రతిపాదిస్తూ అసోం క్రీడాశాఖ కార్యదర్శి దులాల్ చంద్రదాస్ ఈనెల 5న కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమదాస్ నిలిచింది.
2018లో జరిగిన అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ మహిళల 400మీ. పరుగులో స్వర్ణం గెలిచిన హిమ.. అంతర్జాతీయ స్థాయిలో పసిడి గెలిచిన తొలి ట్రాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల 4×400 మిక్స్డ్, మహిళల 4×400మీ. రిలేల్లో ఆమె బంగారు పతకాలు సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఆమెకు 2018లో అర్జున అవార్డు దక్కింది. అయితే ఈసారి మాత్రం ఖేల్రత్న పురస్కారం కోసం ఆమె, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టీటీ క్రీడాకారిణి మనిక బత్రా, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పోటీపడనుంది.