BS-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీం బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : July 31, 2020 / 04:55 PM IST
BS-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీం బ్యాన్

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​లో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై వేటు వేసింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ వెనక్కి తీసుకుంది.



లాక్​డౌన్​ సమయంలోనూ బీఎస్​-4 వాహనాల అమ్మకాలు జరగడంపై మండిపడింది సుప్రీంకోర్టు. వాటి రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి.. అమ్మకాలు చేశారని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చిలోనే ఈ వాహనాల అమ్మకాలపై కోర్టు నిషేధం విధించినా.. ఆ నెల 31 తర్వాత అమ్మకాలు కొనసాగించడాన్ని సుప్రీం తప్పుపట్టింది.

వాహన డీలర్ల వద్ద ఉన్న బీఎస్‌-4 వాహనాలకు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని మార్చి 27న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్శాసనం.. తదుపరి ఆదేశాల వరకు బీఎస్​-4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.



వేరే దేశాలకు బీఎస్​-4 వాహనాలను ఎగుమతి చేసి, అక్కడ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని డీలర్ల సంఘం కోరికపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. కొన్ని దేశాలు ఇప్పటికీ బీఎస్​-4 విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టలేదని డీలర్లు పేర్కొనగా.. తాము ఎందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. అమ్మకాల విషయంలో విధించిన తుది గడువు తయారీదారులకు తెలిసినా ఎందుకు మరింత ఉత్పత్తి చేశారని ప్రశ్నించింది.