ఒక్క‌రు కాదు.. ముగ్గురు సుమ‌ల‌తలు పోటీ

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 04:22 AM IST
ఒక్క‌రు కాదు.. ముగ్గురు సుమ‌ల‌తలు పోటీ

ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగడం వివాదం సృష్టిస్తోంది. ఏపీలో ఇలాంటి పరిస్థితితో పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. తాము ఓడిపోయినా ఫర్వాలేదు…ప్రత్యర్థివర్గం గెలువ కూడదు. ఇదే ఫార్ములాను ఎన్నికల్లో అవలింబిస్తున్నాయి పలు పార్టీలు. ఒకే పేరుతో ఎన్నికల్లో నిలవడం..ప్రత్యర్థి వర్గానికి చెందిన గుర్తు పోలికలతో ఉన్న మరో గుర్తులుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్ణాటకలో ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రముఖస్థానమైన మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రముఖ సినీ నటి సుమలత ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ టికెట్ దక్కపోయినా బరిలో నిలిచిన ఈ నటికి బీజేపీ మద్దతిస్తోంది. కర్ణాటక సినీ పరిశ్రమ అండగా నిలిచింది. ప్రధాన పార్టీలకు సుమలత గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి. కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై ఆమె పోటీ చేస్తున్నారు.

అయితే ఆమెకు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. మాండ్యా నియోజకవర్గం నుండి సుమలత పేరిట నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో అసలైన సుమలతకు కొత్త సమస్యలు ఎదురువచ్చి పడ్డాయి. తనను ఓడించేందుకు ప్రత్యర్థులు కుయుక్తులు పన్నారని, ఓడిపోతామనే భయంతో ఇలా చేశారని చెప్పుకొచ్చారు సుమలత. ప్రజలు తన వైపు ఉన్నారని..గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నారు సుమలత.

సుమలత భర్త అంబరీష్. ఇటీవలే ఆయన కన్నుమూశారు. కాంగ్రెస్ తరపున అంబరీష్ మాండ్యా నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన స్వస్థలం కావడంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడి నుండి బరిలో దిగితే గెలుపు సులువతుందని సుమలత భావిస్తున్నారు. అంతేగాకుండా కన్నడ ఇండస్ట్రీకి చెందిన కిచ్చా సుదీప్, పునీత్ రాజ్ కుమార్‌, రజనీకాంత్‌లు మద్దతు పలుకుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు మద్దతు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి గెలుపు ఎవరిదో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.