Jio కాసుకో.. Vodafone Idea కొత్త పేరు, లోగో.. వీఐ పేరుతో రీబ్రాండ్.. త్వరలో కస్టమర్లకు భారీ షాక్?
దేశంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్, ఐడియా సంస్థ దూకుడు పెంచింది. కొత్త పేరు, కొత్త లోగోతో ముందుకు వచ్చింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన బ్రాండ్ పేరును మార్చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండ్ ని ‘వీఐ’ (Vi)(We అని పలకాలి) గా రీబ్రాండ్ చేసింది. వొడాఫోన్, ఐడియా సంస్థల విలీనం తర్వాత రెండు కంపెనీలు వొడాఫోన్ ఐడియా పేరుతోనే మార్కెటింగ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త బ్రాండ్ పేరుతో మార్కెట్లో కనిపించనున్నాయి.
ఇకపై కంపెనీ ప్రిపెయిడ్ కార్డ్స్ సహా ఇతర మార్కెటింగ్ ప్రొడక్టులపై వీఐ గుర్తును చూస్తాం. ఏజీఆర్(Adjusted Gross Revenue) కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కంపెనీ బోర్డు రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బ్రాండ్ పేరు మార్చడం గమనార్హం.
జియో, ఎయిర్ టెల్ కు గట్టి పోటీ:
మొబైల్ సేవల దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా పావులు కదిపింది. వీఐ పేరుతో కొత్త వైర్లెస్ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్ సేవలలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్ ప్రకటించడం గమనార్హం.
రూ.25వేల కోట్ల సమీకరణకు గ్రీన్ సిగ్నల్:
ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారాంతాన వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 25వేల కోట్ల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విభిన్న మార్గాలలో దశలవారీగా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించింది. కంపెనీ సుమారు రూ. 50వేల కోట్ల మేర ఏజీఆర్ బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
Vi అంటే మేము అని అర్థం:
సంస్థ రీబ్రాండింగ్ ద్వారా దేశంలోని టెలికాం రంగంలో తీవ్రమైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు టక్కర్ తెలిపారు. “ఈ రోజు విఐ (Vi)అనే బ్రాండ్ను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. భారతీయుల జీవితంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రయాణంలో విఐ (Vi) కస్టమర్ అవసరాలను తీర్చడంపై దృష్టి పెడుతుంది. విఐ (Vi) అనే పేరు వొడాఫోన్ ఐడియా పేర్లకు మరింత వివరంగా, విఐ (Vi) అంటే ‘మేము’ అనే అర్ధంతో భారతీయ సమాజంలోని సామూహిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అని టక్కర్ తెలిపారు.
టెలికం మార్కెట్లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్వర్క్ బలోపేతం లక్ష్యాలతో నూతన బ్రాండ్ వీఐను సోమవారం(సెప్టెంబర్ 7,2020) కంపెనీ ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ పరిధిలో ఉన్నారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసిన వారం వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా నూతన బ్రాండ్తో మార్పు దిశగా అడుగువేసింది.
100 కోట్ల మందికి 4జీ సేవలు:
‘‘రెండేళ్ల క్రితం విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు అతిపెద్ద నెట్వర్క్లు, ఉద్యోగులు, ప్రక్రియల విలీనంపై దృష్టి పెట్టాము. ఇప్పుడు వీఐ కొత్త బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొచ్చాము. కొత్త బ్రాండ్ పేరుతో ఇరు కంపెనీల విలీనం పూర్తయ్యింది, దీంతో ఇక తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తాము. భవిష్యత్తుపై దృష్టితో కస్టమర్ల కోసం రూపొందించిన బ్రాండ్ వీఐ. రెండు బ్రాండ్ల ఏకీకరణతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం విలీనం పూర్తయింది. అంతేకాదు 4జీ నెట్వర్క్పై 100 కోట్ల భారతీయులకు బలమైన డిజిటల్ సేవలు అందించేందుకు, భవిష్యత్తు ప్రయాణానికి వీలుగా కంపెనీ సిద్ధమైంది’’ అంటూ వీఐ బ్రాండ్ను వర్చువల్గా ఆవిష్కరించిన సందర్భంగా వొడాఫోన్, ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు.
త్వరలో కస్టమర్లకు భారీ షాక్:
గత కాలపు బకాయిల చెల్లింపులకు టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు పదేళ్ల గడువు ఇవ్వడాన్ని సానుకూల పరిణామంగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. ఇకపోతే వొడాఫోన్ ఐడియా కంపెనీ తన యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. టారిఫ్ ధరలను పెంచాలని యోచిస్తోంది. తద్వారా ఏఆర్పీయూను పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఏఆర్పీయూ రూ.114గా ఉంది. అదే ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.157గా, రిలయన్స్ జియో ఏఆర్పీయూ రూ.140గా ఉంది.
మనుగడ సాగించాలంటే మొబైల్ చార్జీలు పెంచాల్సిందే:
పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టారిఫ్లను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదనపు టారిఫ్లు (చార్జీలు) చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని, గతంలో చెల్లించిన మాదిరే (జియో రాక పూర్వం) ఉండొచ్చని టక్కర్ అన్నారు. తొలుత రూ.200కు, అనంతరం రూ.300కు టారిఫ్లు పెరగడం తప్పనిసరి అన్నారు. చార్జీలు పెంచేందుకు తాము సంకోచించడం లేదని.. ఇదే సరైన తరుణమని భావిస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్మిట్టల్ సైతం ఇదే విధమైన ప్రకటనను ఇటీవలే చేసిన విషయం గమనార్హం.
https://10tv.in/vegetables-vendor-display-corona-negative-report-infront-of-his-shop/
సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆనందం:
ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58వేల కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. పదేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీకి పెద్ద ఉపశమనే లభించినట్టయింది. తాము ఇప్పటికే 10 శాతం చెల్లించేశామని, కనుక తదుపరి చెల్లింపులు 2020 మార్చిలోనే చేయాల్సి ఉంటుందని టక్కర్ స్పష్టం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోగా.. ఇండస్టవర్స్లో తనకున్న వాటాను విక్రయించే ప్రణాళికతో ఉంది. ఫైబర్, డేటా సెంటర్ల ఆస్తుల విక్రయంతోనూ నిధులు సమీకరించాలనుకుంటోంది. తదుపరి నిధుల సమీకరణలో ప్రమోటర్ సంస్థ వొడాఫోన్ గ్రూపు కూడా పాల్గొనే ఉద్దేశ్యం ఉందా..? అన్న ప్రశ్నకు.. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టక్కర్ స్పష్టం చేశారు.
వొడాఫోన్ ఆగస్టు 2018 లో ఐడియా సెల్యులార్లో విలీనం అయ్యింది. అయితే వొడాఫోన్, ఐడియా రెండూ ఇప్పటి వరకు వేర్వేరు బ్రాండ్ గుర్తింపులను కొనసాగించాయి. ఇకపోతే కొత్త వీఐ బ్రాండుతో కలిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రాండింగ్ పేరు కూడా ఆకర్షణీయంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి.