Hyderabad T20 Match Betting : కాయ్ రాజా కాయ్.. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు

ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.

Hyderabad T20 Match Betting : కాయ్ రాజా కాయ్.. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు

Hyderabad T20 Match Betting : ఆదివారం.. ఆహ్లాదకరమైన సాయంత్రం. అద్భుతమైన స్టేడియం. సూపర్ స్టార్లతో కూడిన రెండు పెద్ద జట్ల మధ్య టీ20 ఫైట్. అందులోనూ సిరీస్ డిసైడర్. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇంతకంటే ఎంజాయ్ మెంట్ ఏముంటుంది. స్టేడియంలో మ్యాచ్ ను లైవ్ లో చూస్తే వచ్చే కిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు క్రికెట్ లవర్స్.

అంతర్జాతీయ మ్యాచ్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు టీ20 ఫైట్ ను ఆస్వాదించడానికి ఇంతకంటే గొప్ప రోజేం ఉంటుంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య జరిగే ఆఖరి టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టేడియంలోకి ఫ్యాన్స్ ను పంపించడం ప్రారంభించారు.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్-ఆసీస్ జట్లు చెరో విజయంతో సమానంగా నిలిచాయి. ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.

టాస్ గెలవడం మొదలు బాల్‌ బై బాల్‌, ఓవర్ బై ఓవర్.. ప్రతీ పరుగు‌, వికెట్‌.. ఇలా అన్నింటిపైనా బుకీలు బెట్టింగ్‌ ‍కడుతున్నారు. బుకీలు, మినీ బుకీలుగా రెండు రకాలుగా బెట్టింగ్ ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌ నడుస్తోంది. ఆన్‌లైన్‌లో లక్షల మంది బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఓవర్ లో ఎన్ని ఫోర్లు, సిక్స్ లు కొడతారు అనే దానిపైనా బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఈ మ్యాచ్ లో గెలిచిన వారికే సిరీస్ దక్కనుండటంతో బెట్టింగ్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇండియా గెలుస్తుందని భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అటు ఆస్ట్రేలియాపై వెయ్యికి 4వేలు ఇచ్చేలా బెట్టింగ్ కాస్తున్నారు.

కాగా, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం గురించి తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బెట్టింగ్‌ రాయళ్లపై ఎస్‌వోటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.