హైదరాబాద్ లో ఎయిర్​ టెల్​ 5G వచ్చేసింది

హైదరాబాద్ లో ఎయిర్​ టెల్​ 5G వచ్చేసింది

Airtel రిలయన్స్ జియోతో 5G యుద్దానికి ఎయిర్ టెల్ సిద్దమైంది. 2021 ద్వితీయార్థంలో తమ సొంత టెక్నాలజీ ఉపయోగించి 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించగా..తాజాగా ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను మొదలుపెట్టేసింది. దానికి సంబంధించి హైదరాబాద్ లో గురువారం కమర్షియల్ నెట్ వర్క్ లపై డెమో కూడా ఇచ్చింది. నాన్ స్టాండ్ అలోన్ (ఎన్ఎస్ఏ) నెట్ వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్జ్ బ్యాండ్ లో 5జీ, 4జీ రెండింటినీ సమాంతరంగా పనిచేయించి చూపించింది. 5జీ డెమాన్ స్ట్రేషన్ కోసం ఒప్పో రెనో 5 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో స్మార్ట్ ఫోన్లను ఎయిర్ టెల్ వినియోగించింది.

ప్రస్తుతమున్న నెట్ వర్క్ లతో పోలిస్తే ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధులు తెలిపారు. ఓ సినిమాను కేవలం కొన్ని క్షణాల్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని అంటున్నారు. తమకు పరికరాలను అందించే ఎరిక్సన్ తో కలిసి కొత్త 5జీని ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. 1800 మెగాహెర్జ్, 2100, 2300 మెగాహెర్జ్ ల తరంగదైర్ఘ్యాల వద్ద ఇది పనిచేస్తుందని చెప్పింది. ఇటు సబ్ గిగాహెర్జ్ బ్యాండ్స్ అయిన 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్ వద్ద కూడా మంచి సేవలు అందుతాయని తెలిపింది.

ఇప్పుడున్న 4G స్పెక్ట్రమ్ బ్యాండ్స్ తోనే దేశంలోనే ఇప్పటికిప్పుడు 5G సేవలను కమర్షియల్ గా ప్రారంభించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎయిర్ టెల్ ప్రకటించింది. మిడ్ బ్యాండ్ అవసరం లేకుండానే తాము దేశంలో కమర్షియల్ 5G సర్వీసెస్ ను లాంఛ్ చేయగలదని..ఇప్పుడున్న తమ నెట్ వర్క్ ఇప్పుడు హైస్పీడ్ టెక్నాలజీని పూర్తిగా సపోర్ట్ చేస్తుందని ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విఠల్ చెప్పారు. అయితే ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ రిలీజ్ చేసేవరకు వేచిచూడనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఓకే చెప్పిన వెంటనే 5జీని తెస్తామని, దానికి సంబంధించిన అన్ని స్పెక్ట్రమ్ బ్యాండ్స్ సరిపోనూ ఉన్నాయని గోపాల్ విఠల్ చెప్పారు.