హైదరాబాద్ లో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి..తగ్గింది
హైదరాబాద్ లో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి..తగ్గిపోయిందని పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్యపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
కానీ చాలా మందికి కరోనా సోకిందనే విషయం తెలియదని, ఇంకా 2 లక్షల మందికి కరోనా వైరస్ సోకిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మురుగు నీటి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.
లక్షణాలు లేనివారు, తత్ఫలితంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రానివారే అధికంగా ఉండి ఉండవచ్చునని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. లక్షణాల్లేని వారు ఎక్కువగా ఉండటం వల్లే ఆసుపత్రుల్లో రద్దీ తక్కువగా ఉందన్నారు. వైరస్ సోకినవారు 35 రోజుల వరకు వైరస్ నకళ్లను విసర్జించే అవకాశం ఉన్నందున గత నెల రోజుల్లో 6.6 లక్షల మందిలో వైరస్ ఉన్నట్లు లెక్కించారు.