గ్రేటర్ కాంగ్రెస్ లో టిక్కెట్ల కేటాయింపుపై నేతల అసంతృప్తి
Congress tickets Allocation controversial : గ్రేటర్ కాంగ్రెస్లో టిక్కెట్ల అంశం నేతల అసంతృప్తికి తెరలేపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టికెట్ల కేటాయింపు సంప్రదాయాలకు విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా కమిటీలు వేసి.. టిక్కెట్లు ఇవ్వడం కాంగ్రెస్లో కల్లోలం రేపుతోంది. కొంతమంది నేతలు పార్టీ అధిష్టానంపై అలకబూనగా.. మరికొంత మంది హస్తానికి గుడ్బై చెప్పేయాలని డిసైడ్ అయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. గతంలో ఉన్న సంప్రదాయాలకు విరుద్ధంగా ఈసారి హస్తంపార్టీ కొత్త పద్ధతిని అవలంబించింది. బల్దియాలో పోటీచేసే అభ్యర్థులకు…. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టిక్కెట్ల కేటాయింపు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు, నగర నాయకుల ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు.
ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికారు. కొత్తగా అనుసరిస్తోన్న పద్ధతిలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్కు ప్రభావశీలమైన పాత్ర లేకుండా పోయింది. దీంతో కొంతమంది పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అంజన్కుమార్ యాదవ్…కూడా తన అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ కొత్తగా అనుసరిస్తోన్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు.
https://10tv.in/trs-campaign-ktr-roadshow-kcr-public-meeting/
గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యమ్ ఠాకూర్ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే టీపీసీసీ చీప్ ఉత్తమ్కుమార్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్తో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించారు. అయినా అంజన్కుమార్ యాదవ్ వర్గీయులు మాత్రం అసంతృప్తిని తెలియజేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్ను తీవ్ర నిరుత్సాహంలోకపడేస్తున్నాయి. దీంతో కొంతమంది కార్యకర్తలు పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ నేతలు కొంతమంది కాంగ్రెస్ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారన్న ఊహాగాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ నేతలకు గాలం వేయడంలాంటి అంశాలు ఇప్పుడు పార్టీలో హాట్టాఫిక్గా మారాయి.
బీజేపీ దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం ఉండకూదనే భావనతో ఈసారి గ్రేటర్ అభ్యర్థుల ఎంపికను భిన్నంగా చేపడుతున్నట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేస్తున్నారు. ఇది తాత్కాలిక సమస్యని, దీనివల్ల పార్టీకి ఎలాంటి నష్టంలేదని సీనియర్లు వాదిస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలో అసంతృప్తులు, అలుకలు కొంతకాలమే. తమ పార్టీలో ఇలాంటి సమస్యలు టీ కప్పులో తుపాను లాంటివని ఉత్తమ్ తెలిపారు. పార్టీలో బేదాభిప్రాయాలు ఉన్నా… గ్రేటర్ అభ్యర్థుల ఎంపిక సజావుగా సాగుతోందని వెల్లడించారు. సొంత పార్టీ నేతల అసంతృప్తి మధ్య ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.