Jupally Krishna Rao : పంజరంలోంచి బయటపడినట్లుగా ఉంది.. సస్పెన్షన్పై జూపల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jupally Krishna Rao : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం తనకు సంతోషంగా ఉందని.. పంజరం నుంచి బయటపడినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. పాలన పాదర్శకంగా ఉండాలని కోరుకోటం తప్పా అని ప్రశ్నించారు. పారదర్శక పాలన చేయటం సీఎం బాధ్యత.. కానీ ఆ బాధ్యతను విస్మరించి నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. వాళ్ల బండారం బయటపడుతుందనే భయంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు జూపల్లి.
తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించిన జూపల్లి.. తన ప్రశ్నలకు సమాధానం ఏది చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. సీఎం అంటే ధర్మకర్త లాంటివారు.. ప్రజల సొమ్ము ఖర్చుపెట్టే సమయంలో నిజాయితీగా ఉండాలని.. ప్రజల సొమ్మును ఖర్చుపెట్టేటప్పుడు ఆచి తూచి ఖర్చుపెట్టాలని పదే పదే చెబుతున్నా.. అందుకే తాను పనికిరాకుండాపోయాను అంటూ వాపోయారు జూపల్లి.
నా ఇంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉందంటున్నారు ఉంటే తప్పేంటీ? నా ఇంట్లో ఎవరి ఫోటోలు పెట్టుకోవాలో కూడా వారే నిర్ణయిస్తారా? ఇది నా వ్యక్తిగతం ఎవరి ఫోటో అయినా పెట్టుకుంటాను రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకోవద్దని చెప్పటానికి వారెవరు? అని ప్రశ్నించారు. 2011లో టీఆర్ఎస్ పార్టీలో చేరాను.. తెలంగాణ ప్రజల కోసమే చేరాను అంటూ స్పష్టం చేశారు. తన ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫొటోతోపాటూ.. కేసీఆర్ ఫొటో కూడా ఉందన్నారు.
Also Read: వేటు పడింది..! బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కొద్దికాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత నెలరోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం, సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారనేది స్పష్టత రాలేదు. అలాగే జూపల్లి కూడా ఏపార్టీలో చేరతారు అనేది ఆసక్తికరంగా మారింది.