వరంగల్‌లో మెడికల్ మాఫియా.. గర్భ సంచులతో వ్యాపారం

  • Published By: Subhan ,Published On : June 25, 2020 / 03:54 PM IST
వరంగల్‌లో మెడికల్ మాఫియా.. గర్భ సంచులతో వ్యాపారం

గ్రామీణ ప్రాంతాల్లో గర్భసంచుల వ్యాపారంతో.. మెడికల్ మాఫియా కోట్లు కొల్లగొడుతోంది. కమీషన్ల కోసం ఆర్‌ఎంపీ డాక్టర్లు, ఆస్పత్రులు వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. కడుపు నొప్పంటూ ఏ మహిళైనా ఆస్పత్రికి వస్తే చాలు.. నడిచి వచ్చే ఇరవై ముప్పే వేల రూపాయల నోటులాగే వారిని ట్రీట్‌ చేస్తున్నారు. పేద అమాయక మహిళలే టార్గెట్‌గా బిజినెస్‌ చేస్తున్నారు.

ఎవరైనా మహిళ కడుపునొప్పి అని స్థానిక ఆర్ఎంపీని ఆశ్రయిస్తే చాలు.. ఒకటి రెండు సార్లు ఏదో ఒక మందిచ్చి పంపించేస్తారు. తగ్గలేదంటూ బాధితులు మళ్లీ వస్తే..  అప్పటికే డీల్ కుదుర్చుకున్న ఆర్ఎంపీ డాక్టర్.. మరో ప్రైవేట్ వైద్యుడి వద్దకు పంపిస్తారు. ఇంకేముంది పెద్ద డాక్టరు కూడా మొదట ట్రిట్‌మెంట్ చేసినట్లుగా నాలుగు గోలీలిచ్చి పంపిస్తాడు.. అంతటితో ఆగితే సరి.. నొప్పి తగ్గలేదంటూ రెండోసారి వచ్చారా.. అడ్డంగా కడుపులు కోసేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్టర్లు, ఆర్ఎంపీలు కుమ్మకై  చేస్తున్న ఈ దందాను పసిగట్ట లేక.. అమాయక మహిళలు జీవితాలను చీకట్లోకి నెట్టేసుకుంటున్నారు. 

ఏ తండా చూసినా 30మంది కంటే తగ్గకుండా బాధితులు ఉంటున్నారు. దీనంతటికీ అక్కడి ఆర్ఎంపీలే కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లా కేంద్రాలు, సమీప పట్టణ కేంద్రాల్లో ని పెద్దాసుపత్రులు ఈ దందాను జోరుగా నడిపిస్తున్నాయి. ఈ దందాలో కోట్ల రూపాయలు సంపాదించిన వైద్యులు.. ఆర్ఎంపీలకు వాటాలిస్తున్నారు. ఆ కమీషన్ల కోసం ఆర్ఎంపీలు దీన్ని పెద్ద బిజినెస్‌గా మార్చారు.  

ఆపరేషన్‌ తర్వాత రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో పనులు చేసుకోలేక .. పేద మహిళలు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం 40 సంవత్సరాల లోపు వారికి ఎంతో అవసరమైతే తప్ప గర్భసంచి తొలగించకూడదు.  స్త్రీ జీవితంలో గర్భాశయం, అండాశయాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అనారోగ్యం కారణంగా ఎంతో అవసరమైతే తప్ప గర్భ సంచి ఆఫరేషన్లు చేయకూడదు. మందులతో  తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వైద్యులు ముప్పై ఏళ్ల వయస్సులోపు వారికే గర్భసంచుల ఆపరేషన్‌ చేస్తున్నారు. 

వైద్యుల దగ్గరికి చూపించుకోవడానికి వెళ్లిన మహిళలకు రోగ నిర్థారణ చేయకుండానే పెద్ద ఆపరేషన్‌ చేయాలంటున్నారు డాక్టర్లు. దీంతో భయపడిపోయిన మహిళలు విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు తెచ్చి మరీ వైద్యం చేయించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 50 మంది మహిళల్లో సగటున 15 నుంచి 20 మంది గర్భకోశ వ్యాధులతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, ఆసుపత్రుల మధ్యవర్తులు కమీషన్ల కోసం పక్క జిల్లాలకు సైతం బాధితులను తీసుకెళ్తున్నారు. 

అవసరం లేకున్నా గర్భ సంచి తొలగింపు శస్త్ర చికిత్సలు జరిపించి సొమ్ము చేసుకుంటున్నారు.  మరి కొంత మంది వైద్యులు ప్రసవం తర్వాత సాధారణంగా ఉండే గర్భాశయ వాపును ప్రమాదకరంగా చూపిస్తూ గర్భసంచిని తొలగిస్తున్నారు. ప్రాణ భయాన్ని చూపి తమ పని కానిచ్చేస్తున్నారు.