ట్రాఫిక్ కష్టాల విముక్తి కోసం : హైదరాబాద్ లో రోప్ వే, ఎక్కడెక్కడ…పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకే!

ట్రాఫిక్ కష్టాల విముక్తి కోసం : హైదరాబాద్ లో రోప్ వే, ఎక్కడెక్కడ…పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకే!

హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు తరచూ ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్ వే మార్గాన్ని హైదరాబాద్ కు పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు అథార్టీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది.

డీపీఆర్ :-
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా..మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చింది. కాస్త పరిస్థితి మెరుగు పడినా..కీలక సమయాల్లో సైతం మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీనికి ‘రోప్ వే’ మార్గం పరిష్కారమని భావిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్‌లతో పాటు యాదాద్రిలో మరో కారిడార్‌ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించే అవకాశాలను పరిశీలిస్తోంది.

ఒక్కో క్యాబిన్ లో 8 మంది :-
భూమి నుంచి 50 – 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్‌లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్‌ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే సౌకర్యం ఏర్పాటు చేయాలని యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు.

ఎక్కడెక్కడ :-
మెట్రో లేని మార్గాలైన ఎంజీబీఎస్‌, నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్‌ నుంచి సచివాలయం, ప్యారడైజ్‌ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తో పాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్, సంజీవయ్య పార్కు కూడా ఉన్నాయి. అంతేగాకుండా..భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్‌ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు.