అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్, విచారణ నుంచి తప్పుకున్న న్యాయవాది

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 08:31 PM IST
అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్, విచారణ నుంచి తప్పుకున్న న్యాయవాది

Updated On : November 11, 2020 / 9:06 PM IST

Abdul Salam Family Suicide Case : నంద్యాల అబ్దుల్ సలాం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయవాది రామచంద్రారావు ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తరపున ఈయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా…2020, నవంబర్ 11వ తేదీ బుధవారం సాయంత్రం..సంచలన నిర్ణయం తీసుకున్నారు.



విచారణ నుంచి తప్పుకోవడమే కాకుండా..టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఇప్పటికే నిందితుల బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల బెయిల్ రద్దుపై 2020, నవంబర్ 12వ తేదీ గురువారం కోర్టులో విచారణ జరుగనుంది.



ఈ ఘటనపై సీఎం జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయపరంగా చర్యలు తీసుకున్నామని, ఆత్మహత్యకు కారణమైన పోలీసులను అరెస్ట్ చేయించామని తెలిపారు. అయితే.. టీడీపీకి చెందిన రామచంద్రరావు అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేసి వాదించారని జగన్ చెప్పారు. వాళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదన్నారు. వారి బెయిల్‌ను రద్దు చేయాలని సెషన్స్ కోర్టుని ఆశ్రయించినట్టు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరతామన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ మండిపడ్డారు.



నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో 2020, నవంబర్ 08వ తేదీ ఆదివారం నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లను అరెస్టు చేశారు. అయితే..వీరికి నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.



నిందితులు సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితులు బెయిల్ కోసం ఆశ్రయించగా, నంద్యాల కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.