Gudivada Amarnath : చంద్రబాబు తర్వాత జైలుకెళ్లేది అతడే? ఇది శాంపిల్ మాత్రమే, మమతా బెనర్జీ చెప్పింది అదే- మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలనం
వ్యవస్థలను చూపించి భయపెట్టి ఇంతకాలం తప్పించుకున్నారు. ఈ కేసు శాంపిల్ మాత్రమే. ఇంకా స్కాంలు ప్రజల ముందుకు వస్తాయి. Gudivada Amarnath - Nara Lokesh
![Gudivada Amarnath : చంద్రబాబు తర్వాత జైలుకెళ్లేది అతడే? ఇది శాంపిల్ మాత్రమే, మమతా బెనర్జీ చెప్పింది అదే- మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలనం Gudivada Amarnath : చంద్రబాబు తర్వాత జైలుకెళ్లేది అతడే? ఇది శాంపిల్ మాత్రమే, మమతా బెనర్జీ చెప్పింది అదే- మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలనం](https://10tv.in/wp-content/uploads/2023/09/Gudivada-Amarnath.jpg)
Gudivada Amarnath - Nara Lokesh
Gudivada Amarnath – Nara Lokesh : ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఎవరూ ఊహించని రేంజ్ లో హీటెక్కాయి. రాజకీయం క్షణక్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతోంది. కేసులు, అరెస్టులతో రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. సడెన్ గా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడం, జ్యుడీషియల్ రిమాండ్ విధించడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం.. ఇలా అన్నీ షాకింగ్ పరిణామాలే. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. ఇదిలా ఉంటే, అధికార వైసీపీ నాయకులు మరిన్ని సంచలన, షాకింగ్ విషయాలు చెబుతున్నారు. త్వరలో మరిన్ని స్కామ్ లు బయటకు వస్తాయని, మరికొంతమంది జైలుకెళ్తారని బాంబులు పేలుస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, చంద్రబాబు తర్వాత జైలుకి వెళ్లేది ఎవరో మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. త్వరలో మరిన్ని స్కామ్ లు బయటకు వస్తాయని బాంబు పేల్చారాయన.
”దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి ఏపీ సీఎంగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు జైలు పాలయ్యారు. అభినవ వీరప్పన్ చంద్రబాబు. ఖైదీ నంబర్ 7691 చంద్రబాబు ఇంతకాలం చట్టం నుంచి తప్పించుకున్నారు. అడవుల్లో ఉన్న వీరప్పన్ ఎలా తప్పించుకోలేకపోయారో అలాగే చంద్రబాబు కూడా తప్పించుకోలేకపోయారు. స్కిల్ కుంభకోణం, ఫైబర్ నెట్, అమరావతి ల్యాండ్ ఇలా ఎన్నో స్కాంలు చంద్రబాబు చేశారు.
సీమెన్స్ వ్యవహారాల్లో రూ.371 కోట్ల డబ్బు మీ జేబుల్లోకి వెళ్లిందని కోర్టులు నమ్మాయి. అందుకే చంద్రబాబు జైలుకి వెళ్లారు. ఇందులో రాజకీయ కక్ష ఏ మాత్రం లేదు. రెండున్నరేళ్ల మంత్రిగా పని చేసిన లోకేశ్.. కార్పొరేషన్లకు ఫైల్ రాదంటున్నారు. మీకసలు అవగాహన ఉందా? డబ్బులు వచ్చే ఫైల్ మాత్రమే గుర్తుందా? తండ్రీ కొడుకులు రాష్ట్ర ఖజానా లూటీ చేసి విమర్శలు చేస్తారా?
నెక్ట్స్ జైలుకెళ్లేది మీరే లోకేశ్. వ్యవస్థలను చూపించి భయపెట్టి ఇంతకాలం తప్పించుకున్నారు. ఈ కేసు శాంపిల్ మాత్రమే. ఇంకా స్కాంలు ప్రజల ముందుకు వస్తాయి. ఐటీ స్కాం జరిగితే సమాధానం చెప్పరు. స్కిల్ కుంభకోణంకి సమాధానం చెప్పరు. బంద్ విజయవంతం అయ్యింది అన్నారు. మీ హెరిటేజ్, మీ రామోజీ ప్రియా షాప్ లు కూడా తెరిచి ఉన్నాయి. కనీసం టీడీపీ నాయకులు కూడా బంద్ లో పాల్గొనలేదు.
చంద్రబాబు ఆయన కేసు ఆయనే వాదించుకున్నారట. ఇది సినిమా కాదు. ఏపీ సీఎంగా పని చేసి అవినీతితో జైలుకెళ్లిన తొలి వ్యక్తి చంద్రబాబు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ ను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి అమర్నాథ్ స్పందించారు. పారదర్శకంగా విచారణ జరిపించాలి.. మమతా బెనర్జీ చెప్పింది ఇదే అని ఆయన అన్నారు. కానీ, టీడీపీ నేతలు మమతా బెనర్జీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. కేసుల విచారణ కోర్టులు, దర్యాప్తు సంస్థలు చూస్తాయని, రాజకీయ పార్టీలు చూడవనే విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను శాంతి భద్రతల పేరిట ఆపితే విన్యాసాలు చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన కుమారుడు లోకేశ్ కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ బాధపడ్డారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ వాటా ఎంతో చెప్పాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు.