Viral Video: అతి ముఖ్యమైన సమావేశంలో.. హాయిగా స్మార్ట్ఫోన్లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్న రెవెన్యూ అధికారి
ఇదే సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీశ్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు.

ఓ సమావేశంలో మిగతా అధికారులు సీరియస్గా సమస్యలపై చర్చిస్తుంటే అందులోని ఓ రెవెన్యూ అధికారి మాత్రం హాయిగా స్మార్ట్ఫోన్లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ భేటీ అయింది. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంత ముఖ్యమైన సమావేశంలో మిగతా అధికారులందరూ ఎన్నో పత్రాలను చూస్తూ, తమ పని తాము చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
డీఆర్వో మలోలానేమో సమావేశంలో ఉన్నానన్న విషయాన్నే మర్చిపోయినట్లు, ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తాపీగా ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుకున్నారు. అసలు ఆ సమావేశానికి, తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా ఆయన తీరు ఉండడం గమనార్హం.
సమావేశంలో టైమ్పాస్ కావడం లేదన్నట్లు జేబులో నుంచి స్మార్ట్ఫోన్ తీసి ఆన్లైన్ గేమ్లోనే లీనమైపోయి చిన్నపిల్లాడిలా ఆటాడుకున్నారు. ఆ రెవెన్యూ అధికారి వీడియో బయటకు రావడంతో ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంత ముఖ్యమైన సమావేశంలో ఆయన వ్యవహరించిర తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాగా, అంతకుముందు ఈ సమావేశానికి హాజరైన రాజీవ్ రంజన్ మిశ్రాకు డీఆర్వో మలోలా స్వాగతం పలికారు. ఇదే సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీశ్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు.
Vishnu Kumar Raju: స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. రాజీనామా చేసిపోండి అంటూ..