ఎస్సీ వర్గీకరణ కింద ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల.. విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో..
విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్లను నిర్వచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు 2025కు సంబంధించి గురువారం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కింద ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొంటూ నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ముఖ్యాంశాలు ఇవే..
- మూడు కేటగిరీలుగా ఉప కులాల వర్గీకరణ కింద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు
- మొదటి గ్రూప్ లోని రెల్లి సహా 12 ఉప కులాలకు 1 శాతం చొప్పున రిజర్వేషన్
- రెండో గ్రూప్ లో మాదిగ సహా 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్
- మూడో గ్రూప్ లోని మాల సహా 29 ఉప కులాల కు 7.5 శాతం రిజర్వేషన్
- మొత్తంగా ఎస్సీ వర్గీకరణ కింద 15 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిబంధనలు జారీ
- మొత్తం 200 రోస్టర్ పాయింట్ల అమలుకు నిర్ణయం
- ఉద్యోగాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ లు ఈ మూడు కేటగిరిల్లో ను వర్తిస్తుందని పేర్కొంటూ ఆదేశాలు
- నోటిఫికేషన్ ల సమయంలో అర్హులైన అభ్యర్ధులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్ కు ఆ ఖాళీలు బదలాయిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు
- ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిబంధనల అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్