మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్.. మరో 15 రోజుల్లో ఆశావహులకు గుడ్న్యూస్ రాబోతుందా?
దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది.

CM Chandrababu Naidu
కూటమి ప్రభుత్వ పెద్దలు మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి సర్కారు.. తొలి జాబితాలో 21 మంది, సెకండ్ లిస్ట్లో 59 మందితో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. అయితే ఆ రెండుసార్లు కూడా..కొందరికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసినవారిలో చాలామంది నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
గత రెండు జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే..టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల కుటుంబం కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
పదవి కోసం ఎదురుచూపులు
ఇక గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కళ్లుకాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది చంద్రబాబు చల్లటి చూపు కోసం ఎదురు చూస్తున్నారు.
దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదువులు ఇంకా భర్తీ కాలేదు. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్ కూడా పెండింగ్లోనే ఉన్నాయి.
పదువులను ఆశిస్తున్న మరి కొందరు..
ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనపర్తి శ్రీనివాసరావు, సాహెబ్, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటాగౌతమ్, పెందుర్తి వెంకటేశ్, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు
ఇలా ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇందులో ఎవరికి ఏ కార్పొరేషన్ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొందరు నేతలు అయితే కార్పొరేషన్ పదవుల కంటే..ఎమ్మెల్సీ బెర్తుల కోసమే పట్టుబడుతున్నారట. ఎవరికి నామినేటెడ్ పోస్టులు దక్కబోతున్నాయి. ఏ నేతలు ఎమ్మెల్సీలు కాబోతున్నారనేది మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
CM Revanth Reddy: రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..