AP MBBS Fees: ఏపీ వైద్య విద్యార్థులకు షాక్.. కోర్సుల ఫీజుల పెంపు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల ఫీజులను(AP MBBS Fees) పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
ap government increase mbbs, bds and pg medical course fees
- వైద్య కోర్సుల ఫీజుల పెంపు
- 10, 15 శాతం పెంపు
- 2026-27 విద్యాసంవత్సరం నుండి వర్తింపు
AP MBBS Fees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యవిద్య అభ్యసించే విద్యార్థులకు బిగ్ షాక్ ఇస్తూ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల ఫీజులను పెంచుతూ (AP MBBS Fees)అధికారికంగా నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. ఈ పెంపుదల రాబోయే 2026-27 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి రానుండటంతో, మెడిసిన్ సీటు సాధించాలని ఆశించే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తమ బడ్జెట్ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల నూతన ఫీజుల వివరాలు:
యుజి కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్లలో ఫీజులను ప్రభుత్వం 10 శాతం పెంచింది. సవరించిన ధరల ప్రకారం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ.18,150 కాగా, మేనేజ్మెంట్ కోటా రూ. 14.52 లక్షలు, ఎన్నారై కోటా రూ. 43.56 లక్షలుగా నిర్ణయించారు. అలాగే బీడీఎస్ కోర్సు విషయానికొస్తే కన్వీనర్ కోటా సీటు రూ. 15,730, మేనేజ్మెంట్ కోటా రూ. 4.84 లక్షలు, ఎన్నారై కోటా ఫీజు రూ. 14.52 లక్షలుగా ఖరారైంది.
పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ధరల సవరణ:
వైద్యవిద్య పీజీ కోర్సుల ఫీజును ప్రభుత్వం ఏకంగా 15 శాతం మేర పెంచింది. కొత్త విధానంలో పీజీ కన్వీనర్ కోటా సీటు రూ. 5.71 లక్షలు, మేనేజ్మెంట్ కోటా రూ. 11.42 లక్షలు కాగా, ఎన్నారై కోటా ఫీజు ఏకంగా రూ. 66.12 లక్షలకు చేరింది. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ. 19.38 లక్షలుగా నియోగిస్తూ వైద్యారోగ్యశాఖ జీవో విడుదల చేసింది.
