AP Excise Policy: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. బార్ల వ్యాపారులకు బిగ్ రిలీఫ్
గతంలో రిటైల్ షాపులతో పోలిస్తే బార్లకు మద్యం ఎక్కువ ధరకు సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవని వ్యాపారులు పేర్కొంటున్నారు.
Liquor Representative Image (Image Credit To Original Source)
- బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు
- 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్
- ఇకపై ఒకే మద్యానికి రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల తేడా ఉండదు
AP Excise Policy: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. బార్లపై అదనపు పన్ను రద్దు చేసింది. ఇక మద్యం ఎక్కడ కొన్నా ఒకటే రేటు ఉండనుంది. ఇప్పటివరకు బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను విధిస్తున్నారు. దీన్ని పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను తొలగిస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 24ను మంగళవారం జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం బార్ల వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. ఇకపై ఒకే మద్యానికి రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల తేడా ఉండదు. ధరల్లో సమానత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్పై ఇకపై అదనపు పన్ను ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని, అలాగే 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుల అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్బీసీఎల్ అధికారులు బాధ్యత వహించనున్నారు.
ఈ ఉత్తర్వులు జనవరి 13 నుంచే అమల్లోకి వస్తాయి. గతంలో రిటైల్ షాపులతో పోలిస్తే బార్లకు మద్యం ఎక్కువ ధరకు సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ఖర్చులు తగ్గి, బార్లకు పెద్ద ఊరట లభించిందని వారు భావిస్తున్నారు.
