టన్ను ఇసుకకు రూ.15ఇస్తే చాలు

ఇకపై ఆంధ్రప్రదేశ్లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేయడానికి ఇదే అతి తక్కువ ధర అని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రాలోని పది జిల్లాల్లో వంద రేవులను గుర్తించి వాటిల్లో ఇసుక తవ్వడంతోపాటు సమీపంలో ఏర్పాటు చేసిన 50 నిల్వ కేంద్రాలకు తరలించేందుకు ఏపీఎండీసీ టెండర్లను పిలిచింది.
కాంట్రాక్టర్లు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకే కోట్ చేస్తుండటంతో అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేవుల్లో తవ్వకాలు, నిల్వ కేంద్రాలకు ఇసుక తరలించేందుకు 46 మంది కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. కొందరు అతి తక్కువ ధరకు కోట్ చేయడం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కని పరిస్థితి. 11 టన్నుల ఇసుకను రవాణా చేయడానికి 6 చక్రాల టిప్పర్ అవసరం. 4 కి.మీ. ప్రయాణించడానికి లీటర్ డీజిల్ కావాల్సిందే. ఇలా 10 కి.మీ.దూరం రవాణా, తిరుగు ప్రయాణం కలిపి రూ.348 వరకు ఖర్చవుతుందనుకంటే దానికి డ్రైవర్, లారీ కిరాయి ఎక్స్ట్రా. కి.మీ.కు రూ.1.90 చొప్పున లెక్కిస్తే రూ.209 మాత్రమే గుత్తేదారుకు లాభం. ఇదే లెక్క ప్రకారం గుత్తేదారుకు అన్నివిధాలా నష్టమే అయినా తక్కువ ధరకు కోట్ చేయడం గమనార్హం.
కస్టమర్లకు తరలించడానికీ తక్కువగానే:
* గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల నుంచి ఇసుక తరలించేందుకు అత్యల్పంగా టన్నుకు.. కి.మీ.కు రూ.1.90 పైసల చొప్పున ఇస్తే చాలంటూ టెండరు వేశారు.
* అధికంగా అనంతపురం జిల్లాలో కి.మీ.కు రూ.8.40కు టెండరు కోట్ అయింది.
వంశధార కాంట్రాక్టర్లకు మరో అవకాశం:
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుంచి ఇసుక తవ్వి తరలించడానికి ఓ కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో టన్నుకు రూ.299 కోట్ చేశాడు. టన్ను యావరేజ్ రూ.100-105గా ఉండాలని అధికారులు నిర్ణయించారు. దీంతో శనివారం నిర్వహించే రివర్స్ టెండరింగ్లో మాత్రం రూ.వందకు పైగా టెండర్ వేసిన వారినే పిలవాలని నిర్ణయించారు.