House Site Pattas : అధైర్యం వద్దు, మీకూ ఇంటి స్థలం వస్తుంది.. 3.77 లక్షల మందికి జగన్ ప్రభుత్వం లేఖలు

House Site Pattas : అధైర్యం వద్దు, మీకూ ఇంటి స్థలం వస్తుంది.. 3.77 లక్షల మందికి జగన్ ప్రభుత్వం లేఖలు

Cm Jagan

Updated On : March 29, 2021 / 1:25 PM IST

House Site Pattas : అధైర్యం వద్దు, మీకూ ఇంటి స్థలం వస్తుంది.. అంటూ రాష్ట్రంలోని 3.77లక్షల మందికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇళ్ల స్థలాలు రాలేదని పేదలు అధైర్య పడకుండా వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం లేఖలు రాసింది. మీకూ ఇళ్ల స్థలం మంజూరైందని, కోర్టుల్లో కేసులు తేలగానే ఇళ్ల స్థలాల పట్టాలిస్తామని లేఖలో తెలిపారు అధికారులు. కోర్టులో కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు అందని లబ్ధిదారులందరికీ సీఎం ఆదేశాల మేరకు లేఖల పంపిణీ పూర్తి చేశారు.

ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్నది సీఎం జగన్ ధృఢ సంకల్పం. అయితే ఈ సంకల్పానికి గండి కొట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని, అందువల్లే తాత్కాలికంగా 3.77 లక్షల మందికిపైగా పేదల గూడుకు అడ్డు తగిలిందని లేఖలో వివరించింది ప్రభుత్వం. టీడీపీ నేతలు కోర్టులను ఆశ్రయించి 3లక్షల 77వేల 403 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా అడ్డుకున్నారని చెప్పారు.

ఇంత భారీగా ఇదే తొలిసారి..
ఇప్పటివరకు దేశ చరిత్రలోగానీ రాష్ట్ర చరిత్రలోగానీ పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇంత పెద్దఎత్తున సేకరించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను సంతృప్త స్థాయిలో అందచేసేందుకు ఏకంగా 68 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించి పంపిణీ చేయించారు. సుమారు 30.66 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తేవడంతో 3.77 లక్షల మంది పేదలకు మాత్రం ఇళ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే దీన్ని శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరింపచేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళన చెందకుండా అధికారులు లేఖలు పంపారు. దురుద్దేశపూర్వకంగా దాఖలైన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు.

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఇల్లు లేని నిరు పేదలు రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. వారి సొంతింటి కల నేరవేర్చేందుకు సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది సొంతింటి కలను సాకారం చేశారు. ఇంకా అనేకమందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. అయితే పలు ప్రాంతాల్లో కోర్టు కేసుల కారణంగా ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. కోర్టుల్లో కేసులు క్లియర్ అయ్యాక లబ్దిదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది.