రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఎప్పటికీ ఉచితంగానే విద్యుత్, ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటికీ ఉచితంగానే విద్యుత్ ఇస్తామన్నారు.
ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై సుదీర్ఘ చర్చ:
రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. విద్యుత్ నగదు బదిలీపై రైతులకు అర్థమయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యే, స్థానిక అధికారులకు అప్పటించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.
రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే:
రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని తేల్చి చెప్పిన సీఎం జగన్, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కనెక్షన్ ఉన్న రైతుపేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందన్నారు. ఆ డబ్బుని రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని జగన్ స్పష్టం చేశారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని చెప్పారు.
వచ్చే 30 నుంచి 35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా ఉండదు:
ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా భారం కూడా ఉండదని జగన్ అన్నారు. ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
వచ్చే 30 నుంచి 35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు చేస్తున్నామని అన్నారు. రబీ సీజన్ నుంచి పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైఎస్ఆర్కు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు.