Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’ తుపాన్.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’ తుపాన్.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

cyclone Dana

Updated On : October 23, 2024 / 8:11 AM IST

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయానికి తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘దానా’ అని ఐఎండీ పేరును సూచించింది. దానా ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గురువారం తెల్లవారు జామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చునని.. గురువారం అర్థరాత్రి తరువాత ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 670 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐల్యాండ్కు దక్షిణ – ఆగ్నేయంగా 720 కిలో మీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపురకు దక్షిణ – ఆగ్నేయంగా 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకరమైంది. గత ఆరు గంటలుగా గంటకు మూడు కిలో మీటర్లు వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. తుపాను కారణంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి.

Also Read: Brics Summit 2024: ప్రధాని మోదీతో జిన్‌పింగ్ భేటీ..! ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం

తుపాను తీరందాటే సమయంలో భీకర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం వరకు తుపానుగా బలహీనపడి క్రమంగా తీవ్రత తగ్గి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను కారణంగా ఏపీలోని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో మూడు రోజులు (23, 24, 25 తేదీల్లో) పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.

Also Read: Cyclone Dana Effect : దానా తుఫాను ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు 4 రోజులు సెలవులు!

23న రద్దయిన రైళ్లు..
హైదరాబాద్ – హావ్‌డా ఈస్ట్ కోస్టు,
సికింద్రాబాద్ – హావ్‌డా ఫలక్ నుమా,
కన్యాకుమారీ – డిబ్రూఘర్ – కన్యాకుమారీ,
ముంబయి – భువనేశ్వర్ కోణార్క్,
చెన్నై సెంట్రల్ – హావ్‌డా మెయిల్,
సికింద్రాబాద్ – భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్,
బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ ప్రెస్ తదితర 18 రైళ్లు రద్దు చేశారు.
24న రద్దయిన రైళ్లు..
షాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమాండల్,
పట్నా – ఎర్నాకుళం,
హావ్‌డా – సికింద్రాబాద్ ఫలక్ నుమా,
భువనేశ్వర్ – విశాఖ వందేభారత్,
షాలిమార్ – వాస్కోడిగామా అమరావతి ఎక్స్ ప్రెస్ సహా 37 రైళ్లు రద్దయ్యాయి.
25వ తేదీన..
విశాఖ – అమృత్ సర్
విశాఖ – భువనేశ్వర్
విశాఖ – గుణుపూర్
విశాఖ – బ్రహ్మపుర సహా 11 రైళ్లు రద్దు చేశారు.