Kethireddy Pedda Reddy: దమ్ముంటే నన్ను ఎదుర్కో.. జేసీకి కేతిరెడ్డి సవాల్.. హీటెక్కిన అనంతపురం పాలిటిక్స్
అనంతపురం జిల్లా రాజకీయాలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Former Tadipatri MLA Kethireddy Pedda Reddy sensational comments about JC Prabhakar Reddy.
- తాడిపత్రి గంజాయి హబ్గా మారింది
- జేసీపై కేతిరెడ్డి తీవ్ర ఆరోపణలు
- పోలీసుల ఏకపక్ష వైఖరిపై మండిపాటు
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా రాజకీయాలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు కేసులు పెడుతున్నారని, అదే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే తమ వైపు ఉన్న దాదాపు 25 మందిపై దాడులు చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉన్న అనంత వెంకట్రామిరెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి నానా దుర్భాషలాడటం ఆయన సంస్కారహీనతకు నిదర్శనమని, ఏమైనా అనాలనుకుంటే నేరుగా తన్ను అనాలని పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) సవాల్ విసిరారు.
తాడిపత్రిలో ఐపీఎస్ అధికారి ఉన్నప్పటికీ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ యాక్షన్ డ్రామాలు చేయడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దిట్టని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన జేసీ సోదరులు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడుక్కొనే స్థాయికి దిగజారారని విమర్శించారు. ప్రభాకర్ రెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
తాడిపత్రి ప్రస్తుతం గంజాయి, పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు హబ్గా మారిందని, జేసీకి అవే ముఖ్య ఆదాయవనరులని ఆరోపించారు. అక్కడి పోలీసులకు ప్రభుత్వ జీతాల కంటే జేసీ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉందన్నారు. పోలీసులు పట్టుబడిన గంజాయిలో కొంత భాగాన్ని దాచిపెట్టి, కేవలం కొద్ది మొత్తాన్ని మాత్రమే చూపిస్తూ తప్పుడు కేసులు నడుపుతున్నారని పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
