AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..

వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త మలుపు.. నిందితుల్లో పెరిగిన గుబులు.. ఎందుకు..

Updated On : September 18, 2025 / 8:52 PM IST

AP Liquor Scam Case: ఇప్పటివరకు స్టేట్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ సిట్ టీమే ఆ కేసును దర్యాప్తు చేసింది. 12 మందిని అరెస్ట్ చేసింది. కొన్ని వందల మందిని విచారించింది. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సిట్‌ పెట్టిన కేసులు..చేస్తున్న అలిగేషన్స్..ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలే నిందితులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. 90 రోజుల రిమాండ్ దాటినా ఇంకా నిందితులకు బెయిల్‌ దొరకట్లేదు. ఇప్పటికే బెయిల్ మీదున్న వారికి కూడా నోటీసులు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

సిట్‌ దర్యాప్తే కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. రావడం అంటే మామూలుగా కాదు. డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగిపోయింది. ఏకంగా టీమ్‌లుగా విడిపోయి..ఐదు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ నడిచాయి. దీంతో ఒక్కసారిగా ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగినట్లు అయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ టీమే దర్యాప్తు చేస్తుండటంతో..ఇదంతా రాజకీయ కక్ష సాధింపని..ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే కుట్ర జరుగుతోందని రివర్స్ అటాక్ చేస్తూ వస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో ఈ కేసు ఇంకా పెద్ద సమస్యగా మారే ఛాన్స్ లేకపోలేదు.

వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్‌ పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో..ఈ స్టేజ్‌లో ఈడీ ఎంటర్‌ అయిందంటే ఈ కేసు మరింత క్లిష్టంగా..నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఈడీ కేసులపై ఫైట్ చేయడం అంత ఈజీ కాదు..

సిట్ అలిగేషన్స్ నుంచి తప్పించుకుని బెయిల్‌ తెచ్చుకున్నా..ఈడీ కేసులపై ఫైట్ చేయడం నిందితులకు అంత ఈజీ కాదు. మనీలాండరింగ్‌ అంటూ ఈడీ కేసు పెట్టినా..నగదు సీజ్‌ చేసి..ఆస్తులు ఫ్రీజ్‌ చేసినా ఈ కేసు..ఇంకో మూడు నాలుగేళ్లు నడవడం పక్కా. ఓవైపు కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంటే..మరోవైపు ఆస్తులు ఫ్రీజ్‌ అయితే వాటికి కోర్టు నుంచి క్లీన్ చిట్‌ తెచ్చుకోవడం అతిపెద్ద సమస్యగా చెబుతున్నారు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌.

ఈడీ వేట ఎలా ఉండబోతుంది?

ఈడీ కేసుల్లో బెయిల్‌ దొరకడం అంత ఈజీ కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యిందంటే ఇంకా బిగ్ అప్డేట్‌ ఉండబోతుందన్న టాక్ బయలుదేరింది. ఈడీ దర్యాప్తు స్పీడప్ అయితే..ఈ కేసు ఎవరి టార్గెట్‌గా ముందుకు కదులుతుందనేది మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొన్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. ఇక ఒక్కరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఈడీ వేట ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

దాదాపు రూ. 3,500 కోట్ల స్కామ్‌ జరిగిందంటూ..సిట్ ఆరోపిస్తూ వస్తోంది. నకిలీ లిక్కర్ బ్రాండ్ లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ ఉందని అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తోంది. ఫేక్‌ ఇన్‌వాయిస్‌లు, షెల్ కంపెనీలు, బినామీలు, హవాలా ద్వారా కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు అలిగేషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రైడ్స్ స్టార్ట్ అయ్యాయి.

నిందితులతో సంబంధాలున్న ఆఫీసులు, కంపెనీలతో పాటు 20 చోట్ల సోదాలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిధులను హవాలా ద్వారా వేరే దేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్‌గా చేశారన్నది ప్రధాన అభియోగం. 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ బంగారం షాపుల్లో ఇన్ వాయిస్ క్రియేట్ చేశారన్న అనుమానాలు ఉన్నాయట.

ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు నిందితులు..ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్ట అయి..బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి వేళ..ఈ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది.

23 కంపెనీలలో జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారట. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్ల నగదు వివరాలపై కూడా ఈడీ కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులతో మాట్లాడుతూ..తమకున్న డౌట్స్‌ను క్లారిఫై చేసుకుంటూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఆల్‌ మోస్ట్ లిక్కర్ కేసు చల్లబడిందన్న చర్చ జరుగుతోన్న టైమ్‌లో ఈడీ ఎంటర్ అవడం అయితే..ఇది బిగ్‌ టర్న్ తీసుకోబోతోందన్న అనుమానాలు దారితీస్తోంది. ఈడీ వేట ఎలా ఉంటుందో..మనీలాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారో చూడాలి.

Also Read: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు.. 2 నిమిషాల్లో ఏం మాట్లాడాలి?- జగన్