Pawan Kalyan: లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?

తానే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Pawan Kalyan: లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?

Updated On : October 23, 2025 / 8:00 PM IST

Pawan Kalyan: ఆయన డిప్యూటీ సీఎం. అంటే సీఎం తర్వాత అంతటి పోస్ట్‌ అన్నట్లు. పైగా కూటమిలో కీరోల్. అందుకు తగ్గట్లుగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్‌ కూడా తన శాఖల వ్యవహారాలను చూసుకుంటూనే..లా అండ్ ఆర్డర్‌పై కూడా అప్పుడప్పుడు ఆరా తీస్తున్నారు. ఇదే కొన్నిసార్లు చర్చకు దారితీస్తోంది. విపక్షం అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ హోంశాఖ వ్యవహారాలపై ఆరా తీయడం తప్పా? సేనాని చొరవపై రాద్దాంతం ఎందుకు?

ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పెద్ద వార్తే. ఓ మంత్రి కామెంట్‌ చేసినా..డిప్యూటీ సీఎం పవన్‌ మరో శాఖ అధికారుల పనితీరుపై ఆరా తీసినా రాద్దాంతం అవుతూనే ఉంది. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. సీఎం చంద్రబాబు తర్వాతి స్థానంలో ఉన్నారు సేనాని. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం అంతటి ప్రాధాన్యత కూడా దక్కుతుంది. అంతేకాదు ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ ఫోటోని పెడుతున్నారు.

మామూలుగా అయితే సర్కార్ ఆఫీసుల్లో రాష్ట్రపతి, ప్రధాని, సీఎంల ఫోటోలు మాత్రమే ఉంటాయి. అయితే ఏపీలో పవన్‌కు ఆ హోదా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వంలో అంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ పవన్‌ ఏ శాఖ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. తన శాఖలను నిర్వహిస్తూ..తన ఆఫీస్‌కు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదుల మీదే రియాక్ట్ అవుతున్నారు.

లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు..

అయితే లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించి పవన్‌ కార్యాలయానికి ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నాయట. దీంతో హోంశాఖపై ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రజలకు ఎక్కువగా పోలీస్, రెవిన్యూ శాఖలతోనే పని ఉంటుంది. అలాగే ఫిర్యాదులు వీటి మీదనే వస్తుంటాయి. దాంతో ఆయన వాటి మీద ఫోకస్ పెట్టి తనదైన సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా పేకాట జూదాలపై కూడా పవన్ మరో స్టెప్ ముందుకేసి డీజీపీని నివేదిక కోరారు. ఇప్పుడిదే హాట్ డిస్కషన్‌గా మారింది.

పవన్ కల్యాణ్ అన్ని శాఖలను పట్టించుకోవడం సంతోషకరమని డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు. పవన్ దృష్టి పెట్టింది కూడా ఒక వ్యసనం మీద. దాంతో ఈ అంశంపై డిప్యూటీ సీఎం హోదాలో చొరవ చేసుకున్నా తప్పు పట్టాల్సిందేమి లేదన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పారు పవన్. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై ఆయన తన వాయిస్‌ను బలంగా వినిపించారు. కూటమిలో అయితే పవన్ తీసుకుంటున్న ఈ చొరవపై ఎలాంటి ఇష్యూ లేదు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరడంలో తప్పు ఏమీ లేదని హోంమంత్రి అనిత కూడా చెప్పారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని అంతా ఒక కుటుంబం అన్నట్లుగా మాట్లాడారు. మంత్రులు అంటున్నట్లే సీఎం చంద్రబాబు, లోకేశ్‌ కూడా కూటమిలో పవన్‌కు ప్రయారిటీ దక్కుతుంది. దీంతో ఆయన చొరవ తీసుకోవడంపై రాద్దాంతం అనవసరమన్న టాక్ వినిపిస్తోంది.

హోంశాఖలో జోక్యం చేసుకుంటున్నారని ప్రచారం..

పవన్‌ డీజీపీని నివేదిక కోరడంపై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఉప ముఖ్యమంత్రి హోంశాఖలో జోక్యం చేసుకుంటున్నారని వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కూడా శాంతి భద్రతలు సరిగ్గా లేవని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తన దృష్టికి వచ్చిన అంశాలపై ఓపెన్‌గా మాట్లాడేయడం పవన్‌ నైజం. అంతే తప్ప ఆయనకు ఇతర శాఖల్లో జోక్యం చేసుకుని ఏదో చేయాలన్న ఉద్దేశాలేం ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భీమవరంలో పేకాట జూదం అంటూ ఆయన ఫైర్ అవడం..పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరడంతో ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే డిప్యూటీ సీఎం అంటే మంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏం కాదన్నది కొందరి వాదన. ఇతర శాఖల ఇష్యూలు తన దృష్టికి వస్తే సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే సబబని అంటున్నారు. అయితే హోంమంత్రి అనిత మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ జోక్యం చేసుకుంటే తప్పేం లేదనడంతో..కూటమి ప్రభుత్వంలో వివాదాలు లేవనే క్లారిటీ ఇచ్చినట్లు అయింది. రఘురామ కామెంట్స్ కూడా పవన్‌ తీరును సమర్ధిస్తున్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా పేకాట శిబిరాలపై పవన్ రియాక్షన్‌పై మూడు నాలుగు రోజుల పాటు పెద్ద దుమారమే నడిచింది.

Also Read: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. తిరువూరు టీడీపీలో ముదిరిన వివాదం.. అధిష్టానం సీరియస్..