AP Weather Today : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలు..
AP Weather Today : ఏపీలో నాలుగు రోజులుపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
AP Rains
AP Weather Today : ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అది బలపడి 23న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఇవాళ (ఆదివారం) రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్ళిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
సోమవారం నుంచి నాలుగు రోజులు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. కలెక్టరేట్ లో కంట్రోల్రూమ్ 08942 240557 అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు సీనియర్ అధికారులను ఇంఛార్జ్లుగా నియమించారు. జిల్లాలోని అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. ముందస్తుజాగ్రత్తగా తుఫాన్ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, బియ్యం, ప్రాథమిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
