టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్.. ఆ సినిమా నిర్మాతకు నోటీసులు.. ఇంకా..

అలాగే, తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైందని, తప్పు చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని శ్యామలరావు తెలిపారు.

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్.. ఆ సినిమా నిర్మాతకు నోటీసులు.. ఇంకా..

TTD

Updated On : May 20, 2025 / 5:16 PM IST

టీటీడీ పాలకమండలి ఇవాళ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పలు విభాగాలకు సంబంధించిన 597 పోస్టులు భర్తీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.

శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్ లో సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వీఆర్ఎస్‌కు అంగీకరిస్తే రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Also Read: గుడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం

శ్రీవారి ఆలయ భద్రత దృష్ట్యా యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శ్యామలరావు చెప్పారు. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించామన్నారు. రాజధాని అమరావతి సమీపంలోని అనంతవరంలోని శ్రీవారి ఆలయాభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల కొండల్లో పచ్చదనం పెంచాలన్న సీఎం అదేశానుసారం ప్రభుత్వ అటవీశాఖకు రూ.4 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

తమిళ సినిమా “డీడీ నెక్స్ట్ లెవల్” సాంగ్‌పై సీరియస్ 
గోవిందనామలను వక్రీకరిస్తూ ఇటీవల తమిళ సినిమా డీడీ నెక్స్ట్ లెవల్ సాంగ్ రూపొందించడంపై టీటీడీ సీరియస్ అయింది. లీగల్ నోటీసులు జారీచేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైందని, తప్పు చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని శ్యామలరావు తెలిపారు.

టీటీడీలో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ పై గూగుల్, టీసీఎస్ సంస్థల కసరత్తు జరుగుతోందనిచెప్పారు. టీటీడీలో ఉద్యోగ పదోన్నతులు అమలుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల తలెత్తిన సమస్యలు త్వరలో పరిష్కరించి, ప్రమోషన్స్ ఇస్తామని తెలిపారు. బిగ్, జనతా క్యాంటీన్లకు గతంలో ఆదాయం ప్రాతిపదికన టెండర్లు పిలిచారని, ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యాంశం కాదని చెప్పారు. భక్తులకు నాణ్యమైన ఆహారం విక్రయించే బ్రాండెడ్ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.