Tadipatri Transco office : ట్రాన్స్ కో ఆఫీసులో మందు..విందు, ఆపై వీరంగం..కత్తులు, రాడ్లతో దాడులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. తాడిపత్రిలోని శివాలయం వద్ద ఉన్న ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్లో తాగుబోతులు విందు చేసుకున్నారు.
Liquor party : ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలుగా భావించాల్సిన కొంతమంది ఉద్యోగులు బార్గా మార్చేస్తున్నారు. విచ్చలవిడిగా మందు సేవిస్తూ..విందులు చేసుకుంటున్నారు. తాజాగా..అనంతపురం జిల్లా తాడిపత్రిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. తాడిపత్రిలోని శివాలయం వద్ద ఉన్న ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్లో తాగుబోతులు విందు చేసుకున్నారు. ఆ తర్వాత మద్యం మత్తులో ప్రభుత్వ కార్యాలయంలో వీరంగం చేశారు. కత్తులు, ఇనుప రాడ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సబ్స్టేషన్లోని ఫర్నీచర్, విద్యుత్ పరికరాలు, కిటీకి అద్దాలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ట్రాన్స్ కో సబ్స్టేషన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో రాజకీయ పార్టీకి చెందిన కొందరు విందు ఏర్పాటు చేయడమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. అటు ఘర్షణ సమయంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా… వారు రాలేదని గాయపడిన యువకులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ కో కార్యాలయంలోనే మందు పార్టీ జరుగుతున్నా ఆ శాఖ అధికారులు కనీసం స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ట్రాన్స్ కో కార్యాలయంలో తరచూ విందులు జరుగుతున్నాయని… ఈ విషయం తెలిసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధాకారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.