Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. సీఐడీ నోటీసులు.. ఆరోజున విచారణకు రావాలంటూ..
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు.

VijaySai Reddy
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు.
అక్రమంగా పోర్ట్ వాటాలను బదిలీ చేయించుకున్నారంటూ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు కేవీ రావు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 బీఎన్ ఎస్ సెక్షన్ల కింద వీఎస్ఆర్ కు నోటీసులు ఇచ్చారు సీఐడీ ఎస్పీ.
Also Read : మొన్న వంశీ, నిన్న పోసాని.. నెక్ట్స్ ఆ మాజీమంత్రి కూడా అరెస్ట్కు సిద్ధం కావాల్సిందేనా? వరుస కేసులు తప్పవా?
పోర్ట్ వాటాల అక్రమ బదిలీపై వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు సాయిరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్ట్ వాటాల అక్రమ బదిలీ ఆరోపణలతో విక్రాంత్ రెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏ1గా విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రా రెడ్డి, ఏ4గా శ్రీధర్, ఏ5గా అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రా ఉన్నారు.
కాగా, ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారాయన. వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు.