Rain Alert : దూసుకొస్తున్న ద్రోణి.. ఏపీలో ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్నవానలు.. భీకర గాలులు, పిడుగులు.. హెచ్చరికలు జారీ..
Rain Alert : వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
- రెండుమూడు రోజులు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
- బలమైన గాలులుతోపాటు పిడుగులతో కూడిన వానలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు భానుడు ఉగ్రరూపం దాల్చుతుండగా.. మరోవైపు వర్షాలుసైతం పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో గత వారంరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం ద్రోణి దూసుకొస్తుండటంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్ కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కొమొరిన్ నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతోపాటు బలమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతోపాటు బలమైన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచకనా వేసింది.
వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. అత్యధికంగా 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం పోలవరం జిల్లా కూనవరం,VRపురం మండలాల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లో.. కోనసీమ జిల్లా ఆత్రేయపురం.. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం మండలాల్లో.. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, పోలవరం జిల్లాలోని చింతూరు, మారేడుమిల్లి గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎండల తీవ్రతతోపాటు వడగాల్పుల కారణంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
