Pawan Kalyan: కాలగర్భంలో కలిసిపోతాయి జాగ్రత్త.. ఓడలు బండ్లవుతాయి జగన్: పవన్ కల్యాణ్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది ఎంపీలు కాదని, 5 కోట్ల మంది ప్రజలు అనే విషయాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ..
![Pawan Kalyan: కాలగర్భంలో కలిసిపోతాయి జాగ్రత్త.. ఓడలు బండ్లవుతాయి జగన్: పవన్ కల్యాణ్ హెచ్చరిక Pawan Kalyan: కాలగర్భంలో కలిసిపోతాయి జాగ్రత్త.. ఓడలు బండ్లవుతాయి జగన్: పవన్ కల్యాణ్ హెచ్చరిక](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-20-1.jpg)
Pawan Kalyan
Pawan Kalyan – YCP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన (JanaSena) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ద్వేషంతో ఉన్న మనుషుల ఆలోచనలు కాలగర్భంలో కలిసిపోతాయని పవన్ కల్యాణ్ చెప్పారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇంకో మతానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని చెప్పారు. రాజ్యాంగం 6వ పేజీలో హక్కుల గురించి మాట్లాడేప్పుడు సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ చిత్రాలు ఉంటాయని తెలిపారు.
రాజ్యాంగం 17 వ పేజీలో రాష్ట్ర నిర్దేశక సూత్రాలను చెప్పేటప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసే ఫొటో ఉంటుందని పవన్ కల్యాణ్ వివరించారు. 20వ పేజీలో బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ఫొటో ఉంటుందని అన్నారు. 63వ పేజీలో మహావీరుడి ఫొటో, 113వ పేజీలో శివుడు నటరాజుగా ఉన్న ఫొటో ఉంటుందన్నారు.
అలాగే, 132 పేజీలో మొగల్ చరిత్ర అక్బర్ గురించి, పేజీ 141లో శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, 149 వ పేజీలో దండి మార్చ్, 154 లో బెంగాల్లో గాంధీ పర్యటన, 160 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫొటో ఉంటాయని తెలిపారు. ప్రతి నాయకుడికి రాజ్యాంగంపై అవగాహన ఉండాలని అన్నారు. రాజ్యాంగం అనే రూల్ బుక్ ని అందరూ మర్చిపోవడం వల్లే నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
ఏ అధికార బలం లేని తాను ఇంతబలంగా నిలబడగలగడానికి కారణం రాజ్యాంగం అని చెప్పారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ కూడా ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని చెప్పారు. అలాంటిది ఏ పదవీలేని జనసేన పార్టీ ఇంత బలంగా నిలబడిందన్నారు. ద్వేషం, దోపిడీ ఎల్లకాలం ఉండబోదని తెలిపారు. యుద్ధం కావాలనుకుంటే తాను కురుక్షేత్ర యుద్ధాన్ని ఇస్తానని అన్నారు. ఏపీలో అధికారులు రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని అన్నారు.
కులానికి, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, సిగ్గుండాలని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది ఎంపీలు కాదని, 5 కోట్ల మంది ప్రజలు అనే విషయాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ.. తమకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, అంత మంది ఎంపీలు ఉన్నారు తమ ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీకి భయపడకూడదని పవన్ అన్నారు. ‘ఓడలు బండ్లవుతాయి జగన్, ఎంతో దూరం లేదు’ అని పవన్ హెచ్చరించారు.