Posani Krishna Murali : తెలీదు, గుర్తులేదు..! పోలీసుల ప్రశ్నలకు నోరు విప్పని పోసాని కృష్ణమురళి..

కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై ఆభియోగాలు నమోదయ్యాయి.

Posani Krishna Murali : తెలీదు, గుర్తులేదు..! పోలీసుల ప్రశ్నలకు నోరు విప్పని పోసాని కృష్ణమురళి..

Updated On : February 27, 2025 / 10:14 PM IST

 

Posani Krishna Murali : సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. 8 గంటలుగా పోసానిని విచారిస్తున్నారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించడం లేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పట్లేదని సమాచారం. తెలీదు, గుర్తు లేదు అని పోసాని చెబుతున్నారట. అటు పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నటుడు పోసానిపై జనసేన నేత మణి ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని.. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగినేని మణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు.

కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై ఆభియోగాలు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా పోసానిపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నిన్న పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పని చేసిన పోసాని బూతులతో రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేశ్ ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతల ఫిర్యాదులు చేశారు. ఏపీలో పలు పోలీస్‌ స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఇక, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పోసాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయలకు ఆయన గుడ్ బై చెప్పేశారు.