ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనలు తిరస్కరణ

ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనలు తిరస్కరణ

Updated On : January 26, 2021 / 11:32 AM IST

AP PanchayatiRaj superiors transfer proposals reject : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీలో గందరగోళం నెలకొంది. పంచాయతీరాజ్ రాజ్ ముఖ్యకార్యదర్శి, కమషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఇప్పుడు బదిలీలు తగవని తెలిపింది. బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్ఈసీ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు యధావిధిగా జరిపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటీషన్లను ధర్మాసనం కొట్టి వేసింది.

స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ కూడా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదించారు.

ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.