ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి రేవంత్ శంకుస్థాపన.. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఏయే సౌకర్యాలు ఉంటాయో తెలుసా?
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చాక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందనున్నాయి.

ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని గోషామహల్ మైదానంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉన్న విషయం తెలిసిందే.
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన భూమి 26.30 ఎకరాలు. మొత్తం ఎనిమిది బ్లాకులుగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు.
ప్రతిపాదిత నిర్మాణ విస్తీర్ణం 32 లక్షల చదరపు అడుగులు. పడకల సామర్థ్యం 2,000. మొత్తం విభాగాలు 30 ఉంటాయి. ఓపీ సేవలు గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాయి. ఆడిటోరియంలో 750 సీట్ల సామర్థ్యం ఉంటుంది. కిడ్నీలు, లివర్, చర్మం మార్పిడి కేంద్రాలను కూడా నిర్మిస్తున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులను తలపించేలా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రిలోని ప్రతి వైద్య విభాగానికి ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తారు.
ఒకేచోట అన్నిరకాల డయాగ్నొస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి దాదాపు రూ.2500 కోట్ల ఖర్చు కానుందని అంచనా. అలాగే, ఈ ఆసుపత్రి నిర్మాణం అనంతరం 20 శాతం వైద్యుల సంఖ్య పెరుగుతుంది. ఈ కొత్త ఆసుపత్రిలో ప్రతిరోజు 5,000 మంది ఓపీ రోగులను చూసే వీలుంటుంది.