Nandigam Suresh: మళ్లీ జైలుకి వైసీపీ మాజీ ఎంపీ.. ఆ కేసులో నందిగం సురేశ్ అరెస్ట్..
ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో రాజుకి చికిత్స అందిస్తున్నారు.

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త రాజుపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మి. దాడిలో తన భర్తకు గాయాలయ్యాంటూ ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో రాజుకి చికిత్స అందిస్తున్నారు.
గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో రాజుపై నిన్న రాత్రి దాడికి తెగబడిన కేసులో సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. నందిగం సురేశ్, ఆయన అనుచరులు.. రాజుపై దాడి చేశారు. దీనిపై బాధితుడి భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: భారత్తో పెట్టుకోవద్దు.. పాకిస్తాన్కు IMF బిగ్ షాక్.. నిధుల మంజూరుకు 11 షరతులు..
వైసీపీ నేత సురేశ్, ఆయన అనుచరుల దాడిలో గాయపడ్డ రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఉద్దండరాయుని పాలెంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సహించలేకపోతున్న సురేశ్, ఆయన అనుచరులు తన భర్త రాజుపై దాడి చేశారని భార్య లక్ష్మి ఆరోపించారు. నందిగం సురేశ్ నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు రాజు భార్య.
కాగా, పాతకక్షలతోనే రాజుపై నందిగం సురేశ్ దాడి చేశారని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. చంపాలనే ఉద్దేశ్యంతోనే దాడి జరిగిందన్నారు. నందిగం సురేశ్ పై ఇప్పటికే 12 కేసులు ఉన్నాయని, సురేశ్ బెయిల్ రద్దు విషయంపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని డీఎస్పీ మురళీ కృష్ణ వెల్లడించారు.