ఆ వాయిస్‌ ఎవరిదో? : పోలీసు స్టేషన్‌కు తుమ్మల!

  • Published By: sreehari ,Published On : January 7, 2020 / 12:25 PM IST
ఆ వాయిస్‌ ఎవరిదో? : పోలీసు స్టేషన్‌కు తుమ్మల!

Updated On : January 7, 2020 / 12:25 PM IST

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు.. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వద్ద నెంబర్ టూగా ప్రాచుర్యం పొందారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా నిలిచారు. జలగం వెంగళరావు కుటుంబాన్ని రాజకీయంగా ఎదిరించిన నేపథ్యం ఉండడంతో బాగా గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ మారారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినా కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన కొందరు మంత్రుల్లో తుమ్మల కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఆయన ఏ రోజు పోలీసులను ఆశ్రయంచ లేదు. అనేక అంశాల్లో కొందరు పోలీసు అధికారులే అయన కనుసైగకు ఎస్ సర్ అన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అలాంటి కాకలు తీరిన రాజకీయ నేత మొట్ట మొదటి సారి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఖమ్మంలో ఆడియో హాట్ టాపిక్ :
తన కను సైగలతోనే దశాబ్దాల తరబడి రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వరరావు… పోలీసుల తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ఇలా పోలీసుల గురించి మాట్లాడడం ఇదే తొలిసారి. ఖమ్మం రూరల్ మండలం అరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీశ్‌పై కేసు నమోదుకు సంబంధించిన తుమ్మల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. తుమ్మల వాయిస్‌తో వైరల్ అవుతున్న ఆడియో ఖమ్మంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా తుమ్మల పోలీసులను ఆశ్రయించటం చర్చకు దారితీసింది.

తుమ్మల తన రాజకీయ జీవితంలో తొలిసారి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఆడియో గురించి పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్ధించారు. తన సంతకంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇదే మొదటిది. వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల… తాజా రాజకీయాల్లో యాక్టివ్‌గా కూడా లేరు. గండుగలపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనటం లేదు. కానీ ఆయన గొంతును పోలిన స్వరంతో ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యూ ట్యూబ్‌లోనూ వైరల్‌గా మారింది.

తుమ్మలకు ఆపాదిస్తూ వీడియో :
అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను తుమ్మలకు ఆపాదిస్తూ ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ విషయంపైనే తుమ్మల ఖమ్మం పోలీసులను అశ్రయించారు. ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాకపోయినా, తన వాయిస్‌గా చిత్రీకరించి, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపైనా, వారి వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరుతున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ఎవరూ ఏమి పలకరేమి? :
ఇంత జరుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు కీర్తించిన నాయకులు నేడు ఎక్కడ? ఎవరూ ఏమి పలకరేమి? మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తుమ్మలపై ఈగ కూడా వాలనివ్వని నేతలు ఇప్పుడు కనీసం ఖండించకుండా మౌనం పాటించటం పట్ల పార్టీలో చర్చ జోరందుకుంది. అధికార పార్టీలోనూ, ప్రజల్లోనూ, విపక్షాల్లో కూడా తుమ్మలను టీఆర్ఎస్‌ పార్టీ పక్కన పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తన గొంతు కాదు బాబోయో అంటున్నా మద్దతుగా నిలిచే వారే కనిపించడం లేదంట. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచి ఖండించే నాయకుడే లేకపోవడంతో తుమ్మల బాగా ఫీలవుతున్నారట.